మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్లపై ఈసీ సీరియస్

మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్లపై ఈసీ సీరియస్

టీఆర్ఎస్​కు ఓటేయకపోతే స్కీంలు ఆగుతాయనడంపై సీరియస్  
ఇయ్యాల మధ్యాహ్నంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశం 
లేకుంటే తగిన నిర్ణయం తీస్కుంటామని వార్నింగ్

హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటేయకుంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్న మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సీరియస్ అయింది. ఓటర్లను బెదిరించడం ద్వారా ఎలక్షన్ కోడ్​ను ఉల్లంఘించడానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ మంత్రికి నోటీసులు ఇచ్చింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలలోపు వివరణ ఇవ్వాలని, లేకపోతే తాము తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ఈ నెల 25న మంత్రి జగదీశ్‌‌రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కపిలవాయి దిలీప్‌‌ కుమార్‌‌ ఈసీకి కంప్లయింట్ చేశారు.

ఆయన ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి నుంచి ఈసీ నివేదిక తెప్పించుకుంది. టీఆర్ఎస్​కు ఓటేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామంటూ జగదీశ్‌‌రెడ్డి హెచ్చరించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ‘‘రూ.2 వేల పెన్షన్ కావాల్నా, వద్దా? రైతుబంధు, 24 గంటల కరెంట్, దివ్యాంగులకు పెన్షన్ వంటి స్కీములు అమలు కావాలంటే కేసీఆర్​కు ఓటేయాలె. ఇవన్నీ ఆగిపోవాలంటే మోడీకి ఓటు వేయాలె” అని మంత్రి కామెంట్లు చేశారు. ఆయన ప్రసంగం నోట్‌‌ను కూడా జిల్లా ఎన్నికల అధికారి ఈసీకి పంపారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయానికి వచ్చింది.