ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. 2024, జనవరి 3వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరింది. ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రెండుసార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే.. రెండు సార్లు కూడా కేజ్రీవాల్ హాజరుకాలేదు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఈడీ అధికారులు కేజ్రీవాల్కు సమన్లు పంపారు.
కేజ్రీవాల్ ముందుగా నవంబర్ 2న విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయన వెళ్లలేదు. మరోసారి గురువారం (డిసెంబర్ 21న) విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన హాజరుకాలేదు. ఇలా చేయడం ఇది రెండోసారి. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే తనకు సమన్లు జారీ అయ్యాయని కేజ్రీవాల్ ఆరోపించారు.