విదేశీ పెట్టుబడులపై ఈడీ ఆరా

విదేశీ పెట్టుబడులపై ఈడీ ఆరా

ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. ఈడీ విచారణ ముగిసింది.  మంచిరెడ్డిని 9గంటల పాటు విచారించారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలపై ఈ ఏడాది ఆగస్ట్ లో మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. ఆ తర్వాత కిషన్ రెడ్డి లిఖితపూర్వక వివరణ కూడా ఇచ్చారు. అయితే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వివరణపై సంతృప్తి చెందని ఈడీ అధికారులు..ఇవాళ విచారణకు పిలిచి ప్రశ్నించారు. బషీర్ బాగ్ లోని ఈడీ ఆఫీస్ లో మంచిరెడ్డి కిషన్ రెడ్డిని క్వశ్చన్ చేశారు. విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు, బ్యాంకు లావాదేవీలపై  ఈడీ అధికారులు ఆరా తీశారు. ఫెమా నిబంధనలు పైన సుదీర్ఘంగా విచారణ జరిగినట్టు తెలుస్తోంది. 

ఎమ్మెల్యే మంచిరెడ్డి స్టేట్‌మెంట్ ను ఈడీ అధికారులు రికార్డు చేసినట్టు తెలుస్తోంది. బ్యాంకు లావాదేవీలపై అధికారులు ఆరా తీసినట్టు సమాచారం. గోల్డ్ మైన్ కు సంబంధించిన వ్యాపారాల్లో జరిగిన అవకతవకలపై అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. నిజానికి ఈడీ నోటీసులపై గతంలోనే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. అయితే దానిపై ఈడీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.