
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ లీడర్, ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంటిపై ఈడీ దాడులు చేసింది. ఆయన ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన హాస్పిటల్స్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ మంగళవారం తనిఖీలు చేపట్టింది.
ఢిల్లీలోని సౌరభ్ భరద్వాజ్ నివాసంతో పాటు మరో 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. ఓ దవాఖాన నిర్మాణం కోసం అప్పటి ఆప్ సర్కారు రూ. 800 కోట్లు ఖర్చు చేసినా..సగం పనులు కూడా పూర్తికాలేదని విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో సౌరభ్ భరద్వాజ్తోపాటు మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, పలువురు కాంట్రాక్టర్లు, ఉద్యోగులపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులోనే సౌరభ్ ఇంటిపై రైడ్స్ చేసింది.
బీజేపీ బెదిరింపులకు భయపడం
సౌరభ్ భరద్వాజ్ ఇంటిపై ఈడీ దాడులను ఆప్ ఖండించింది. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లపై తలెత్తుతున్న ప్రశ్నల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడులు జరిగాయని పేర్కొన్నది.