
- బషీర్బాగ్లోని కార్యాలయంలో 4 గంటలపాటు ఎంక్వైరీ
- చైనాకు చెందిన జంగ్లీ రమ్మీ ప్రమోట్ చేసిన సినీ నటుడు
- యాప్స్ కంపెనీతో అగ్రిమెంట్లు, అకౌంట్లలో డిపాజిట్స్పై ఈడీ ఆరా
- స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అధికారులు
- అనుమానిత లావాదేవీలపై వివరణ ఇవ్వాలని ఆదేశం
- రేపు ఈడీ ముందుకు మంచు లక్ష్మి
హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు. బషీర్బాగ్లోని ఈడీ జోనల్ కార్యాలయానికి సోమవారం ఉదయం 11 గంటలకు చేరుకోగా.. ఆయనను జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారించింది.
చైనాకు చెందిన జంగ్లీ రమ్మీ యాప్స్ ప్రమోట్ చేసేందుకు చేసుకున్న అగ్రిమెంట్లు, గత మూడేండ్ల బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నించారు. దాదాపు 4 గంటల పాటు అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అనుమానాస్పద లావాదేవీల గురించి ఆరా తీశారు. ఇతర రాష్ట్రాల అకౌంట్ల నుంచి జరిగిన డిపాజిట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు అందించాలని సూచించారు. ఈ కేసులో గతంలో విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ.. రానా కొంత సమయం కోరారు. అందుకు ఈడీ అంగీకరించి.. ఆగస్టు 11న హాజరుకావాలని సమన్లు ఇచ్చింది.
చైనా యాప్.. ఇండియాలో ఆపరేషన్స్
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో జులై 30న ప్రకాశ్ రాజ్, ఈ నెల 6న విజయ్ దేవరకొండను ఈడీ విచారించింది. ప్రకాశ్రాజ్, విజయ్ దేవరకొండ తరహాలోనే రానాను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. విజయ్ దేవరకొండ ఏ23 గేమింగ్ యాప్ ప్రమోట్ చేయగా.. రానా దగ్గుబాటి చైనాకు చెందిన జంగ్లీ రమ్మీ తరఫున ప్రచారం చేసినట్టు గుర్తించారు. అయితే, చైనా బెట్టింగ్ యాప్స్ ఇండియాలో పలు కంపెనీలు ఆపరేట్ చేస్తున్నాయి. వీటితో రానాతో సహా సెలబ్రిటీలు ఒప్పందాలు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే యాప్స్ కంపెనీల నుంచి అందిన పారితోషికంసహా రానా అకౌంట్లలో పెద్ద మొత్తంలో జరిగిన లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీంచినట్లు తెలిసింది. పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలతోపాటు బ్యాంక్ స్టేట్మెంట్ల ఆధారంగా ఎంక్వైరీ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే సెలబ్రిటీల అకౌంట్లలో పెద్ద మొత్తంలో అయిన డిపాజిట్లు, ఇతర ఖాతాలకు నగదు బదిలీపై ఆరా తీస్తున్నారు. కాగా, ఇదే కేసులో బుధవారం మంచు లక్ష్మి విచారణకు హాజరుకావాల్సి ఉంది.