‘బిగ్ బాస్’ విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరోగా బ్రహ్మ రుద్ర దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రవీణ, అనిల్ కడియాల నిర్మించారు. జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ టాప్ వన్లో ట్రెండ్ అవుతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్కు అతిథిగా హాజరైన ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి మాట్లాడుతూ ‘ఈ సిరీస్లో కొన్ని గ్లింప్స్ చూశా. చాలా ఇంటరెస్టింగ్గా అనిపించింది. డిటెక్టివ్, యాక్షన్ కలయికలో ఉన్న ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది. టీమ్ అందరికీ నా అభినందనలు’ అని అన్నారు.
మంచి టీమ్ వర్క్తో ఈ ప్రాజెక్ట్ చేశామని, దీన్ని ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్స్ అని నిఖిల్ అన్నాడు. డైరెక్షన్ చాన్స్ ఇచ్చిన ప్రవీణ, అనిల్కు బ్రహ్మ రుద్ర థ్యాంక్స్ చెప్పాడు. ఈ సిరీస్ అందర్నీ ఎంటర్టైన్ చేయడం చాలా సంతోషంగా ఉందని నిర్మాతలు అన్నారు. నటులు అమర్, ఆషు రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్, రైటర్ శ్రీ హర్ష పాల్గొన్నారు.
