
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. కాలం చల్లబడింది. బడిబాట పట్టేందుకు పిల్లలు సిద్ధం అవుతున్నారు. గత ఏడాది అనుభవంతో ప్రభుత్వం ఈ ఏడు ముందే మేల్కొన్నది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు సరిపడా పాఠ్యపుస్తకాలు, డ్రెస్సులు ఆయా పాఠశాలలకు ముందస్తుగా చేరిపోయాయి. ఇక ఉపాధ్యాయుల వృత్త్యంతర శిక్షణ సైతం వేసవి సెలవుల్లో విద్యాశాఖ పూర్తి చేసింది. ప్రభుత్వ పాఠశాలలు బడిబాట కార్యక్రమం చేపట్టాయి.
ప్రభుత్వ బడిలో నెలకు లక్షన్నర వేతనంతో అనుభవ సామర్థ్యం ఉన్న ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తామని అంటుంటే, విశాలమైన ప్రభుత్వ బడిలో పిల్లలు ఎందుకు రోజురోజుకూ తరిగిపోతున్నారు? ఎక్కడో ఇరుకు భవనం అద్దెకు తీసుకొని ప్రైవేటు బడి తెరిస్తే.. దానికే కార్పొరేట్ కలరు అద్దితే..ఆరేడు వేలకు నెలకు ఓ ఉపాధ్యాయుడిని నియమించుకొని బోధన చేస్తుంటే ఎందుకు ఇరుకుసందు బడులు పిల్లలతో కిటకిటలాడుతున్నాయి? ఇవి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయాలు.
మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ బడిని మార్చే విషయం గత పాలకులు పట్టించుకోలేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నవిధంగా ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం తెరిచి చేతులు దులుపుకున్నారు. ముప్ఫైఏళ్ళుగా ఇన్స్పెక్షన్ అథారిటీ ఉన్న మానెటరింగ్ వ్యవస్థ ఏర్పాటు గాలికి వదిలేశారు.
తూతూమంత్రంగా ఇన్చార్జ్లతో కాలం గడిపించారు. అన్నింటికీ మించి తిండి పెడితే అదే సంస్కరణగా భావించి అన్ని వసతులు ఉన్నప్రభుత్వ పాఠశాలలో ఏర్పరచవలసిన రెసిడెన్షియల్ వ్యవస్థను ప్రభుత్వ బడులకు సమాంతరంగా లేకుండా ఏర్పాటు చేసి కమీషన్ల కక్కుర్తితో ప్రభుత్వ విద్యావ్యవస్థను భ్రష్ఠు పట్టించడంతోపాటు, ప్రైవేటు, కార్పోరేట్ విద్యను ప్రొత్సహించినవారినే పాలకులుగా ప్రమోట్ చేసుకున్నారు. ఫలితం ప్రభుత్వ బడిని అనాథగా మార్చారు.
ఇవన్నీ ప్రభుత్వ బడికి పాలకులు ఇచ్చిన శాపాలే? ఇక ఎక్కడ వ్యాపారం జరుగుతుందంటే అక్కడ ఓ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ఏర్పడింది. ఒకటైతే ఫర్వాలేదు. ఒక్కో పట్టణంలో డజను బ్రాంచీలు తెరిచి విద్యావ్యాపారం అధికారుల కనుసన్నల్లోనే ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా వర్థిల్లుతోంది. ఇంతచేసినా మన రాష్ట్రం విద్యాప్రమాణాలలో31వ స్థానంలో ఉంది.
మంచి సంస్కరణలు
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఓ విద్యా కమిషన్ నియమించారు. అదే ప్రభుత్వ బడి గురించి ఆలోచన గుడ్డిలో మెల్ల సంకేతం. కొన్ని అంగన్వాడీ కేంద్రాలు ప్లే స్కూల్గా మార్చి ప్రాథమిక పాఠశాలలో విలీనం చేస్తున్నారు. విద్యా కమిషన్ ప్రభుత్వ బడి సంస్కరణ లో ఒక మోడల్ ఇచ్చింది.
ఈఏడాది ఆ మోడల్కు అవసరం అయిన 5వేల కోట్లు బడ్జెట్లో కేటాయించలేదు. అయితే, ఆ మోడల్ అమలు జరపడానికి మరో కొత్త పాఠశాల ఏర్పాటు కాకుండా ఉన్న ప్రభుత్వ బడులనే మండలానికి నాలుగు తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్, నాలుగు తెలంగాణా పబ్లిక్ స్కూల్స్గా గుర్తించాలి. మండలంలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులను ఈ ఏడు పాఠశాలలకు సర్దుబాటు చేయండి. తెలంగాణ పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమం అందుబాటుతో పాటుసెంట్రల్, స్టేట్ సిలబస్ రెండూ అమలు జరపండి.
వసతిగృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు అన్నీ ఈ మండల పరిధి పాఠశాలల్లో అంతర్భాగం చేసి ప్రతి పాఠశాల డే– కం రెసిడెన్షియల్ బేస్డ్ కు మార్చడం, డిజిటల్ బోర్డు, ఏఐ, కంప్యూటర్ సౌకర్యాలు, నైతిక విద్య, వృత్తి విద్యా, శ్రమవిద్య, పారిశ్రామిక విద్య, వ్యవసాయ విద్య ఇత్యాది ప్రాథమిక అవసరాలతో పాఠశాల ఉంచగలిగితే మళ్ళీ ప్రభుత్వ బడికి మహర్దశ చేకూరుతుంది. పాఠశాలలో సరైన విద్యాసామర్థ్యాలు అందాలంటే ‘విద్యాహక్కు చట్టం’ సూచించిన మార్పులు అన్ని పాఠశాలలు అమలుకావాలి. ఈ బృహత్తర మార్పుకు ప్రభుత్వం ప్రజలు సిద్ధం కావాలని ఆశిద్దాం! మన బడిని మనం కాపాడుకుందాం!
- ఎన్.తిర్మల్, విద్యా విశ్లేషకుడు–