పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతోపాటు సింగూర్ ప్రాజెక్ట్గేట్లు ఎత్తి ఆఫీసర్లు నీటిని విడుదల చేయడంతో వనదుర్గ ప్రాజెక్ట్ పొంగి పొర్లుతోంది. ఆనకట్ట పైనుంచి గంగమ్మ భారీ ఎత్తున ఎగసిపడుతూ దుర్గమ్మ ఆలయాన్ని చుట్టుముట్టి నిజాంసాగర్ వైపు పరుగులు తీస్తోంది. ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఎండోమెంట్ఆఫీసర్లు దుర్గమ్మ ఉత్సహ విగ్రహాన్ని రాజగోపురంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ బాలస్వామి ఏడుపాయలను సందర్శించారు. అనంతరం ఆలయం, ప్రాజెక్ట్ వద్ద ప్రవహిస్తున్న వరదనీటిని పరిశీలించారు. భక్తులు నదీ పరివాహక ప్రాంతంలోకి వెళ్లకుండా ఆలయ సిబ్బందికి, పోలీసులకు సూచనలు అందజేశారు. ఆయన వెంట ఆలయ చైర్మన్ బాలాగౌడ్, కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్, ఆలయ సిబ్బంది ఉన్నారు.
మహారాష్ట్రకు నిలిచిన రాకపోకలు
బోధన్, వెలుగు: నిజామాబాద్ జిల్లా తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని మంజీర నది రాతి బ్రిడ్జి పైనుంచి వరద నీళ్లు పారుతుండడంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరలోకి భారీగా ప్రవాహం వస్తోంది. కొత్త బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడడంతో ఏడాదిగా భారీ వెహికల్స్ రాకపోకలు నిలిపివేశారు. రాతి బ్రిడ్జిపై వెహికల్స్ వెళుతున్నాయి. ప్రస్తుతం రాతి బ్రిడ్జిపై వరద నీళ్లు పారుతుండడంతో వెహికల్స్ వెళ్లకుండ రోడ్డుపై జేసీబీతో గుంత తవ్వారు. దీంతో ఇరురాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మహారాష్ట్ర వెళ్లే ప్రయాణికులు బాసర బ్రిడ్జి పైనుంచి వెళ్లాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.