
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్పై సీబీఐ విచారణ జరిపించాలన్న కాంగ్రెస్ ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించింది. దానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలంటూ చీఫ్ సెక్రటరీకి ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మంగళవారం ఆ ఉత్తర్వులను చీఫ్ సెక్రటరీ(సీఎస్)కు సీఈవో వికాస్ రాజ్ పంపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం బ్యారేజీకి బుంగ పడడం వంటి ఘటనలపై ఈ నెల 3వ తేదీన ఈసీకి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది.
ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సీఈవో వికాస్రాజ్ను కోరింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7వ తేదీన ‘మోస్ట్ ఇమీడియట్’ అని పేర్కొంటూ సీఎస్కు సీఈవో ఉత్తర్వులను జారీ చేశారు. ఏం చర్యలు తీసుకుంటున్నారో ఫిర్యాదుదారుకు తెలియజేయాలని అందులో సూచించారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.