
- అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు
- జనగామ ధర్మకంచె పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
- పరకాలలోనూ సేమ్ సీన్
- నిజామాబాద్ జిల్లా అబ్బాపూర్ బి తండాలో తెగిన ఓటరు చేతి వేలు
- బోధన్లో యువకుడిపై దాడి
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయి. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచె స్కూల్ పోలింగ్కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు లొల్లి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఏసీపీ అంకిత్తో వాగ్వాదానికి దిగారు. హన్మకొండ జిల్లా పరకాల మండలం నాగారంలో ఓటింగ్ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు గొడవ పడ్డారు. కాంగ్రెస్ లీడర్లు తమను కొట్టారంటూ బీఆర్ఎస్ లీడర్లు పీఎస్వద్ద రాత్రి వరకు ఆందోళనకు దిగారు.
నిజామాబాద్ జిల్లా అబ్బాపూర్ (బి) తండాలో తోపులాట జరగడంతో ఒకరి చేతి వేలు తెగిపోయింది. ఇదే జిల్లా బోధన్లో ఓ యువకుడిని మరో వర్గానికి చెందిన యువకులు చితకబాదారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్లో తనపై ఎస్ఐ లాఠీచార్జి చేశారని బీజేపీ బూత్ అధ్యక్షుడు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జనగామ, వెలుగు : జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచె స్కూల్పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు లొల్లికి దిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి..ఏసీపీ అంకిత్తో వాగ్వాదానికి దిగారు. అంతకు ముందు కాంగ్రెస్ రాష్ట్ర యువజన లీడర్ కొమ్మూరి ప్రశాంత్రెడ్డి జనగామ అసెంబ్లీ పోలింగ్ఏజెంట్ హోదాలో ధర్మకంచె పోలింగ్ కేంద్రానికి వచ్చారు. దీనికి బూత్లో ఉన్న బీఆర్ఎస్ ఏజెంట్ ఒకరు అభ్యంతరం తెలిపి వాగ్వాదానికి దిగాడు. ప్రశాంత్రెడ్డి తాను పోలింగ్ ఏజెంట్నని చెప్పినా వినిపించుకోలేదు.
దీంతో సీఐ రఘుపతి రెడ్డి అక్కడికి వచ్చి నచ్చజెప్పారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడకు చేరుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ లీడర్ కొమ్మూరి ప్రశాంత్రెడ్డిని ఎలా లోపలికి పంపించారని కార్యకర్తలతో కలిసి లొల్లి చేశారు. దీనికి ఏసీపీ.. కొమ్మూరికి పోలింగ్ఏజెంట్గా అనుమతి ఉండడంతో లోపలకు పంపించామని చెప్పారు.
అందరికీ సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. మరోవైపు జనగామ మండలం గానుగుపహాడ్లో బీజేపీ లీడర్లు ప్రచారం చేస్తుండడంతో సీఐ రఘుపతి రెడ్డి వారించారు. వారు వినకపోవడంతో స్వల్పంగా లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. జనగామలో జరిగిన గొడవలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులు పక్షపాత వైఖరి అవలంభించారని ఆరోపించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
పరకాలలో హైడ్రామా
పరకాల : హన్మకొండ జిల్లా పరకాల మండలం నాగారంలో పోలింగ్ తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్లీడర్ల మధ్య గొడవ జరిగింది. ఓటింగ్ ముగిసిన తర్వాత ఏ పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పడ్డాయని బీఆర్ఎస్ లీడర్లు గ్రామంలోని ఓ మహిళ ఇంటి ముందు కూర్చుని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ టైంలో అటుగా వచ్చిన కాంగ్రెస్ లీడర్లతో బీఆర్ఎస్ లీడర్లకు గొడవ మొదలైంది. ఈ సందర్భంగా తమపై దాడి చేశారంటూ బీఆర్ఎస్ లీడర్లు పోలీస్స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన చేస్తున్న వారిని లోపలకు తీసుకువెళ్లారు.
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అక్కడకు వచ్చి దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్టేషన్ ఆవరణలో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐ రవిరాజా కల్పించుకుని తాము ఎన్నికల విధుల్లో ఉన్నామని, ఆ డ్యూటీ పూర్తి కాగానే ఈ కేసు సంగతి చూస్తామని చెప్పినా వినిపించుకోలేదు.
దీంతో చల్లా ధర్మారెడ్డి మాజీ మంత్రి దయాకర్రావుతో కలిసి సీపీని కలుస్తానని వెళ్లే ప్రయత్నం చేయగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒప్పుకోలేదు. ‘మేమంతా మీకోసం ఉంటే మీరు వెళ్లిపోతా అనడం ఏమిటి’ అని ప్రశ్నించారు. ‘మీరు వెళ్తే మేమంతా రాజీనామాలు చేస్తాం’ అని హెచ్చరించడంతో ఆయన ఆగిపోయారు. రాత్రి 9 గంటలకు సీపీతో ధర్మారెడ్డి మాట్లాడడంతో ఆయన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో అందరూ ఇండ్లకు వెళ్లిపోయారు.
అబ్బాపూర్లో తెగిన చేతి వేలు
నవీపేట్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని అబ్బాపూర్(బి) తండా 171 పోలింగ్ కేంద్రం వద్ద ఉదయం పది గంటల సమయంలో తోపులాట జరిగింది. లైన్లో ఉన్న ఓటర్లు ఒక్కసారిగా తోసుకోవడంతో పోలీసులు గేట్ వేశారు. ఈ క్రమంలో గేట్ ముందున్న అబ్బాపూర్ (బి) తండాకు చెందిన బెండ చిన్న రాజన్న చేయి గేట్ లో ఇరుక్కుని కుడి చేతి బొటన వేలు తెగిపడింది. వెంటనే అతడిని నవీపేట్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా డాక్టర్లు వేలు తొలగించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తోపులాట జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపించారు.
బోధన్ పోలింగ్ కేంద్రంలో యువకుడిపై దాడి
బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్లోని ఉద్మీర్గల్లీకి చెందిన నందిపేట్నవీన్పై ఓ వర్గానికి చెందిన యువకులు దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. బోధన్లోని 69వ పోలింగ్కేంద్రంలో నవీన్ లైన్లో నిల్చున్నాడు. అక్కడికి వచ్చిన ఓ వర్గానికి చెందిన యువకులు ఓ పార్టీకి ఓటెయ్యాలని చెప్తుండడంతో నవీన అడ్డుకున్నాడు. ఇది మనసులో పెట్టుకున్న వారు ఓటు వేసి బయటకు వచ్చిన అతడిపై ఇటుకలతో దాడి చేశారు. దీంతో అతడిని స్థానికులు గవర్నమెంట్హాస్పిటల్కు తరలించారు. బోధన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ బాధితుడిని పరామర్శించారు.
బీజేపీ బూత్ అధ్యక్షుడిపై లాఠీచార్జ్
ఎల్లారెడ్డిపేట : ఎస్ఐ రమేశ్తనను కులం పేరుతో దూషించడమే కాకుండా లాఠీ చార్జి చేశారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్ కు చెందిన బీజేపీ బూత్ అధ్యక్షుడు రొడ్డ మహేశ్ ఆరోపించారు. పోలింగ్కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఉన్న తనపై ఎస్ఐ లాఠీ చార్జ్ చేయడంతో ఇంటికి వెళ్లిపోయానని, అయినా ఇంటికి వచ్చి మరీ చేయి చేసుకున్నాడని ఆవేదన చెందారు. బీజేపీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డితోకలిసి ఎస్ఐపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ
లింగంపేట : కామారెడ్డి జిల్లా లింగంపేట సమీపంలోని కరీంనగర్ డెయిరీ వద్ద ఆదివారం అర్ధరాత్రి బీజేపీ, కాంగ్రెస్వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కేసులో ఇరువర్గాలకు చెందిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపారు. బీజేపీకి చెందిన టెలికాం సెన్సార్ బోర్డు మెంబర్ రామకృష్ణ గుప్తా, మరో ఇద్దరు కారులో రాత్రి పర్మల్లకు వెళ్తుండగా ఆ ఊరికి చెందిన కాంగ్రెస్ లీడర్లు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
దీంతో రామకృష్ణ లింగంపేట వెళ్తుండగా లింగంపేటకు చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు డెయిరీ వద్ద అడ్డుకున్నారు. ప్రచారం ముగిసిన తర్వాత గ్రామాల్లో ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరినొకరు కొట్టుకున్నారు. రామకృష్ణ గుప్తా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్రనారాగౌడ్లకు గాయాలయ్యాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డ వారిని దవాఖానకు తరలించారు. ఇరువర్గాల ఘర్షణలో రామకృష్ణకు చెందిన కారు ధ్వంసమైంది. పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.