
- రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి నారాయణరెడ్డి
రంగారెడ్డి, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు విధులను సమర్థవంతంగా నిర్వహించాలని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి కలెక్టరేట్లో సోమవారం పోలీస్ అధికారులు, ఎంపీడీవోలు, నోడల్ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఫలితాల వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు.
సభలు, ర్యాలీలకు తప్పనిసరిగా అనుమతి పొందాలని రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సూచించారు. ఫ్లయింగ్ సర్వేలెన్స్ టీం, స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీంలు, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నోడల్, రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ అందించినట్లు తెలిపారు. సమావేశంలో డీసీపీ సునీతారెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు.