- సంగారెడ్డి జిల్లా జమాల్ పూర్ లో ఘటన
రాయికోడ్, వెలుగు: పొలంలో ట్రాక్టర్తో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం విరిగి పడడంతో విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. రాయికోడ్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన బర్దిపూర్ జగన్(18), రాయికోడ్ మోడల్ స్కూల్లో ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్నాడు. చివరి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా బుధవారం స్కూల్ కు సెలవు ఇచ్చారు.
ఇంట్లో ఖాళీగా ఉండలేక ఇదే మండలం నల్లంపల్లికి చెందిన ఓ వ్యక్తి ట్రాక్టర్పై డ్రైవింగ్ పనికి వెళ్లాడు. జమాల్పూర్ శివారులోని ఫామ్హౌస్లో పత్తి కట్టెను చదును చేస్తుండగా ట్రాక్టర్ పక్కనే విద్యుత్ స్తంభానికి సపోర్టుగా ఉన్న వైర్ను ప్రమాదవశాత్తు తాకింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగి ఒక్కసారిగా ట్రాక్టర్పై పడింది.
ట్రాక్టర్ నడుపుతున్న జగన్ తలపై స్తంభం పడడంతో స్పాట్ లో చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి బర్దిపూర్ బాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ యాదగిరి తెలిపారు.
