స్థానిక ఎన్నికలు వెంటనే నిర్వహించాలి : బీజేఎల్పీ నేత ఏలేటి

స్థానిక ఎన్నికలు వెంటనే నిర్వహించాలి : బీజేఎల్పీ నేత ఏలేటి
  • పిచ్చాపాటి కబుర్ల కోసమే కేబినెట్ మీటింగ్: బీజేఎల్పీ నేత ఏలేటి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను తక్షణమే నిర్వహించి, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, దాన్ని అమలు చేయకుండా ఇప్పుడు సాకులు చెబుతున్నారని ఆరోపించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కేబినెట్ మీటింగ్ కేవలం పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి పనికొస్తుందే తప్ప.. ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదని ఆయన ఆరోపించారు.

ఏ ప్రణాళిక, క్లారిటీ లేని కేబినెట్ అంటూ ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికలు జరపకపోవడంతో గ్రామ పాలన కుంటుపడిందని, ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ నీరుగార్చిందని చెప్పారు. రాజీవ్ యువ వికాసం స్కీము కాంగ్రెస్ క్యాడర్‌‌‌‌కు డబ్బులు పంచే స్కీమ్‌‌‌‌గా మారిందన్నారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ డిమాండ్ చేసిందని, అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం అతిపెద్ద నీటి కుంభకోణమని, నీటిని ఎత్తిపోసే ప్రాజెక్ట్ కాదని, నిధులు దోచుకొని దాచుకునే ప్రాజెక్ట్ అంటూ విమర్శలు చేశారు. విద్యుత్ ఒప్పందాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపై సీబీఐ విచారణ కోరాలని సీఎం రేవంత్​రెడ్డిని డిమాండ్ చేశారు.