- స్కిల్స్, పెర్ఫార్మెన్స్ ఆధారంగా బోనస్లు
- టాలెంట్ నిలుపుకోవడంపై కంపెనీల ఫోకస్
- ద్రవ్యోల్బణం, పెర్ఫార్మెన్స్, జాబ్ మార్కెట్ బట్టి జీతాల పెంపు లెక్కలు: మెర్సెర్ రిపోర్ట్
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో ఉద్యోగుల జీతాలు సగటున 9 శాతం పెరగనున్నాయి. స్కిల్స్ బట్టి బోనస్లు, ఇన్సెంటివ్లు ఇవ్వడానికి కంపెనీలు ముందుకొస్తాయని కన్సల్టెంగ్ కంపెనీ మెర్సెర్ ఓ రిపోర్ట్లో పేర్కొంది. ఇండియాలోని కంపెనీలు తమ విధానాలను మారుస్తున్నాయని, ఇండివిడ్యువల్ పెర్ఫార్మెన్స్, ద్రవ్యోల్బణం, ఉద్యోగ మార్కెట్లో పోటీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని శాలరీ హైక్ను లెక్కిస్తున్నాయని అభిప్రాయపడింది.
మొత్తం 8 వేలకిపైగా జాబ్ రోల్స్, 1,500కిపైగా కంపెనీలను పరిశీలించి, ఈ రిపోర్ట్ను మెర్సెర్ తయారుచేసింది. దీని ప్రకారం, సంస్థలు తమ రివార్డ్ ప్యాకేజీలను మరింత పారదర్శకంగా మారుస్తున్నాయి. తక్షణ బోనస్లు ఇవ్వడంతో పాటు, స్కిల్స్ ఆధారంగా ప్రోత్సాహకాలు ఇచ్చి, భవిష్యత్ అవసరాలకు రెడీగా ఉండేలా ఉద్యోగులను తీర్చిదిద్దుతున్నాయి.
‘‘చాలా కంపెనీలు ఖర్చులను నియంత్రిస్తూ, టాలెంట్ను నిలుపుకోవడానికి జీతాలు పెంచాలని చూస్తున్నాయి. అదే సమయంలో, స్కిల్స్, టాలెంట్ అసెస్మెంట్, కొత్త పే ప్రోగ్రామ్స్ ద్వారా ఉద్యోగుల సామర్థ్యాలను వ్యాపార అవసరాలకు అనుగుణంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి”అని మెర్సెర్ ఇండియా రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్ మాలతి కేఎస్ అన్నారు.
రివార్డ్స్ స్ట్రాటజీలో మార్పు..
కంపెనీలు తమ రివార్డ్ స్ట్రాటజీలను మారుస్తున్నాయి. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, టాలెంట్ ఉన్నవారిని నియమించుకోవడం, ఉద్యోగుల బాగోగులు, ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఫోకస్ పెంచాయి. బలమైన, భవిష్యత్తుకు సిద్ధమైన టాలెంట్ను రెడీ చేసుకోవాలని చూస్తున్నాయి. ‘‘ఈ మార్పులతో ఆర్గనైజేషన్లలో కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
వర్క్ ఫోర్స్ను బలపరుచుకోవచ్చు. అంతేకాకుండా తమ వర్క్ ప్లేస్లను మరింత మెరుగ్గా మార్చుకోవచ్చు”అని మాలతి కేఎస్ వివరించారు. బోనస్లు వంటి షార్ట్ టెర్మ్ ఇన్సెంటివ్స్తో ఉద్యోగుల పనితీరు మెరుగుపడే అవకాశం ఉందని, కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు, స్కిల్స్ ఆధారంగా జీతాలు పెంచడంపై ఫోకస్ పెట్టాలని తెలిపారు. కాగా, కొత్త లేబర్ కోడ్స్ అమలుతో సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలను ఉద్యోగులకు కంపెనీలు కచ్చితంగా అందివ్వాలి.
ఈ సెక్టార్లలో ఎక్కువ శాలరీ హైక్
మెర్సెర్ రిపోర్ట్ ప్రకారం, హైటెక్ (ప్రొడక్ట్, కన్సల్టింగ్) రంగంలో జీతాలు 2026లో 9.3 శాతం పెరుగుతాయి. ఆటోమోటివ్ రంగంలో 9.5 శాతం పెరగనుండగా, ఎంప్లాయీ బెనిఫిట్స్లో ఐటీ, ఐటీఈఎస్, జీసీసీ రంగాలు ముందంజలో ఉంటున్నాయి. అలానే చాలా కంపెనీలు డిజిటల్కు షిఫ్ట్ అయ్యాయి. ఏఐ వాడకాన్ని పెంచాయి. ఈ కంపెనీలు ఏయే ఉద్యోగుల జీతాలను పెంచాలని లెక్కలేస్తున్నాయి. స్కిల్స్, పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే శాలరీ హైక్కు కోత పెట్టాలని, ఫలితంగా ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నాయి.
