హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చూస్తే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ హెచ్చరించింది. విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు విద్యుత్ సౌథలో బుధవారం మహాధర్నా నిర్వహించారు. కొత్త చట్టంతో విద్యుత్ సంస్థలను కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని, నిర్వీర్యం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని జేఏసీ కన్వీనర్ శివాజీ ఆరోపించారు. విద్యుత్ సంస్థలతో చర్చలు జరపకుండా ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
పార్లమెంట్లో బిల్లు పెడితే విద్యుత్ సంస్థలన్నీ నేషనల్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ పరిధిలోకి వెళ్తాయని, బుక్ వ్యాల్యూ ప్రకారం సంస్థలను తక్కువ ధరలకు తీసుకుని, అప్పులు రాష్టాల ఖాతాల్లో వేస్తారని అన్నారు. దీంతో పేదలకు సబ్సిడీ పథకాలు వర్తించకుండా పోతాయన్నారు. కొత్త చట్టంతో విద్యుత్ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేయాలనుకుంటోందని కో కన్వీనర్ అంజయ్య ఆరోపించారు. మింట్ కాంపౌండ్లోని టీఎస్ఎస్పీడీసీఎల్ ఆఫీసులో జేఏసీ నేతలు ఆందోళన చేశారు.