న్యూఢిల్లీ: లాక్డౌన్ తర్వాత ప్రతి కంపెనీ లేదా ఎంప్లాయర్ తమ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ను కచ్చితంగా ప్రొవైడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ను ప్రొవైడ్ చేయడం తప్పనిసరి కాదు. దీంతో కొంత మంది ఎంప్లాయర్లు మాత్రమే తమ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను అందించేవారు. సాధారణంగా కంపెనీలు తమ ఉద్యోగులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంటాయి. ఈ పాలసీలు ఉద్యోగుల, వారి కుటుంబ సభ్యుల హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేస్తాయి. కంపెనీల కోసం తగిన ఇండివిడ్యువల్ లేదా గ్రూప్ పాలసీలను ఆఫర్ చేయాలని ఇన్సూరెన్స్ కంపెనీలను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఐఆర్డీఏఐ కోరింది. ఈ పాలసీలను ఆర్గనైజేషన్లు భరించే ధరలలోనే అందించాలని సలహా యిచ్చింది. ప్రభుత్వం నిర్ణయం మంచి విషయమని స్టార్ హెల్త్, ఎలైడ్ ఇన్సూరెన్స్ ఎండీ డా. ఎస్ ప్రకాశ్ అన్నారు. కంపెనీలు తమ ఉద్యోగులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ప్రొవైడ్ చేయొచ్చని, వీటి ఖర్చు చాల తక్కువగా ఉంటుందని తెలిపారు.
ఉద్యోగులకు ఈఎస్ఐతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్?
ఎంప్లాయి స్టేట్ ఇన్సూరెన్స్(ఈఎస్ఐ) బెనిఫిట్స్ను పొందుతున్న ఉద్యోగులకు కూడా కొత్తగా కవర్ చేయనున్న హెల్త్ పాలసీలు అందుబాటులో ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. ఈఎస్ఐ యాక్ట్ 1948 ప్రకారం రూ. 21,000 కంటే తక్కువ జీతం అందుకుంటున్న ఉద్యోగులకు ఈఎస్ఐని ప్రొవైడ్ చేయడం తప్పనిసరి. ఎంప్లాయర్, ఉద్యోగి ఇద్దరూ ఈఎస్ఐ కార్పొరేషన్కు కంట్రిబ్యూట్ చేస్తారు. ఈఎస్ఐకి కిందకు రాని ఉద్యోగుల కోసం గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలను కంపెనీలు తీసుకుంటాయి. కానీ తాజా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎంప్లాయర్ తమ ఉద్యోగులందరికి హెల్త్ పాలసీ ఇవ్వాలి. అందువలన ఈఎస్ఐ కిందకి వచ్చే వారు కూడా గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ను ఎంప్లాయర్ నుంచి పొందవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎంప్లాయర్లు ఇన్సూరెన్స్ కంపెనీతో టై అప్ అయి ఉద్యోగులకు రిటైల్ ఇన్సూరెన్స్ను కవర్ను అందించవచ్చు.