- చివరిరోజు స్వరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ
- సర్దార్ వల్లభాయ్ పటేల్కు కాంగ్రెస్ అగ్రనేత ఘన నివాళి
తాపి: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆదివారంతో గుజరాత్లో ముగిసింది. నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో యాత్ర కొనసాగింది. దాదాపు 400 కిలోమీటర్ల దూరం యాత్ర నిర్వహించారు. చివరిరోజు రాహుల్గాంధీ సూరత్లోని స్వరాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఘన నివాళి అర్పించారు. ఒకరోజు విరామం తర్వాత మంగళవారం నుంచి మహారాష్ట్రలోని నందుర్బర్లో యాత్ర ప్రారంభం కానున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మీడియాతో వెల్లడించారు.
ఇది స్ఫూర్తిదాయక క్షణం: జైరాం రమేశ్
‘1922లో సర్దార్ వల్లభాయ్ నెలకొల్పిన స్వరాజ్ నివాస్ను రాహుల్ గాంధీ సందర్శించారు. ఢిల్లీ–హర్యానా సరిహద్దుల్లో న్యాయంకోసం వివిధ రాష్ట్రాల రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో భారత్ జోడో న్యాయ్ యాత్రకు ఇది స్ఫూర్తిదాయకమైన క్షణం’ అని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ‘మేం ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. దీన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగిస్తాం. మా భావజాల బలోపేతానికి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ఓ మార్గాన్ని చూపారు. దీన్ని మేం ప్రజల్లోకి తీసుకెళ్తాం’ అని పేర్కొన్నారు. కాగా, రాహుల్ గాంధీ గుజరాత్లో యాత్ర ముగిసిన తర్వాత తాపీ జిల్లాలోని వ్యారా జిల్లా నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
