
మెహిదీపట్నం, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యాసంస్థలు డొనేషన్ల పేరుతో దోపిడీ చేస్తున్నాయని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవల మహేందర్ ఆరోపించారు. మంగళ వారం మాసబ్ ట్యాంక్ ఉన్నత విద్యాశాఖ మండలి కార్యాలయం ఎదుట బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవకతవకలకు పాల్పడుతున్న ఇంజినీరింగ్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
స్కాలర్షిప్ విడుదల కాకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు స్టూడెంట్స్కు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ ధర్నాలో ఉపాధ్యక్షులు మహేశ్, తరుణ్, చితరంజాన్, కుమార్, సంతోష్, ప్రధాన కార్యదర్శులు సామల పవన్, గణేశ్, సురేశ్, యోగి, ప్రవీణ్, అశోక్, సుధీంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.