- 17 పోట్లు పొడవడంతో మృతి
- చిలకలగూడ పరిధిలో ఘటన
పద్మారావు నగర్, వెలుగు: తమకు సంబంధించిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, చెప్పినా వినడం లేదని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజినీరింగ్స్టూడెంట్ను అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన యవాన్ (25) ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. సీతాఫల్మండికి చెందిన ఓ యువతితో నాలుగేండ్లుగా ప్రేమలో ఉన్నాడు. సీతాఫల్మండి ఇందిరానగర్లో యవాన్కు ఫ్రెండ్స్ఉండడంతో వారిని కలిసేందుకు తరచూ వస్తుండేవాడు. తను ప్రేమించిన యువతిని కూడా కలుస్తూ ఉండేవాడు. ఈ ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న అమ్మాయి బంధువులు యావన్ కు పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు.
గురువారం యావన్ ఇందిరానగర్ లోని ఫ్రెండ్స్తో కలిసి అరుగుపై కూర్చుని క్రికెట్చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి బావ, సోదరుడు మరో ముగ్గురితో కలిసి కత్తులతో ఇందిరానగర్ వచ్చారు. క్రికెట్చూస్తున్న యావన్ను గొంతుతోపాటు పలుచోట్ల విచక్షణారహితంగా పొడిచారు. మొత్తం 17 చోట్ల పొడవడంతో తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడిపోయాడు. గమనించిన స్థానికులు గాంధీ దవాఖానకు తరలించగా, మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి, నిందితుల కోసం గాలిస్తున్నారు.
