3వ టీ20 లో భారత్ పై ఇంగ్లాండ్ ఘనవిజయం

3వ  టీ20 లో భారత్ పై  ఇంగ్లాండ్ ఘనవిజయం

మొతేరాలో ఇంగ్లాండ్‌ మోత మోగించింది. 3వ టీ20లో టీమ్‌ఇండియాను 8 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. 5 మ్యాచుల సిరీసులో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జోస్‌ బట్లర్‌ (83*; 52 బంతుల్లో 5×4, 4×6) విధ్వంసకరంగా చెలరేగిన వేళ 157 పరుగుల లక్ష్యం సునాయసంగా కరిగిపోయింది. ఛేదన ఆరంభించిన క్షణం నుంచి కోహ్లీ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దాంతో 6 ఓవర్లకే ఇంగ్లాండ్ ‌57/1తో నిలిచింది. జేసన్‌ రాయ్‌ (9; 13 బంతుల్లో 2×4), డేవిడ్‌ మలన్‌ (18; 17 బంతుల్లో 1×6) ఔటైనా అతడదే జోరు కొనసాగించాడు. కెరీర్లో అత్యధిక స్కోరుతో అజేయంగా నిలిచాడు. అతడికి బెయిర్‌ స్టో (40*; 28 బంతుల్లో 5×4) అండగా నిలిచాడు. చాహల్‌, సుందర్‌ చెరో వికెట్‌ తీశారు.
పవర్‌ హిట్టింగ్‌ టీమ్‌ఇండియాలో కోహ్లీ ఆటే హైలైట్‌. శుభారంభం దక్కని జట్టుకు మర్యాదకరమైన స్కోరును అందించాడు. చాన్నాళ్ల తర్వాత అతడు విధ్వంసకరంగా ఆడాడు. పవర్‌ హిట్టింగ్‌తో అలరించాడు. ఇంగ్లాండ్‌ పేసర్ల వేగాన్ని తనకు అనుగుణంగా మలుచుకున్నాడు. కళ్లుచెదిరే సిక్సర్లు బాదేశాడు. 2016 టీ20 ప్రపంచకప్‌ తర్వాత వరుసగా రెండో అర్ధశతకం చేశాడు. తాను ఆడిన ఆఖరి 17 బంతుల్లో ఏకంగా 49 పరుగులు సాధించాడంటే అతడి హిట్టింగ్‌ను అర్థం చేసుకోవచ్చు. పాండ్యతో కలిసి ఆఖరి 5 ఓవర్లలో అతడు 69 పరుగుల రాబట్టాడు.