
కాంటెర్బరీ: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (281 బాల్స్లో 26 ఫోర్లు, 1 సిక్స్తో 204 ) తన ఫామ్ చూపెట్టాడు. ఎనిమిదేండ్ల తర్వాత నేషనల్ టీమ్లోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ ఇంగ్లండ్ లయన్స్తో అనధికార టెస్టులో డబుల్ సెంచరీతో విజృంభించాడు. దాంతో ఓవర్నైట్ స్కోరు 409/3తో రెండో రోజు శనివారం ఆట కొనసాగించిన ఇండియా–ఎ తొలి ఇన్నింగ్స్లో 557 రన్స్కు ఆలౌటైంది. ఆట మొదలైన వెంటనే ఓవర్నైట్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (94) తో పాటు నితీష్ రెడ్డి (7) ఔటైనా కరుణ్ తొలి సెషన్లోనే డబుల్ సెంచరీ దాటాడు.
ఆ తర్వాత అతను కూడా వెనుదిరగ్గా హర్ష్ దూబే (32), శార్దూల్ ఠాకూర్ (27), అన్షుల్ కాంబోజ్ (23), హర్షిత్ రాణా (16) వేగంగా ఆడి స్కోరు 550 దాటించారు. ఆతిథ్య బౌలర్లలో జోషల్ హుల్, జమన్ అక్తర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన లయన్స్ రెండో రోజు ఆట చివరకు 237/2 స్కోరు చేసింది. ఓపెనర్ టామ్ హెయిన్స్ (103 బ్యాటింగ్), మ్యాక్స్ హోల్డెన్ (64 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బెన్ మెకినే (16)ను అన్షుల్, ఎమిలియో గె (46)ను హర్ష్ దూబే ఔట్ చేశారు.