
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్ విమెన్స్తో మంగళవారం జరిగిన ఐదో వన్డేలో ఇండియా భారీ స్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (84 బాల్స్లో 14 ఫోర్లతో 102), జెమీమా రొడ్రిగ్స్ (50) దంచికొట్టడంతో.. టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 318/5 స్కోరు చేసింది. ఇంగ్లండ్పై ఇండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓపెనర్లలో ప్రతీకా రావల్ (26) విఫలమైనా.. స్మృతి మంధాన (45) మెరుగ్గా ఆడింది. ఈ ఇద్దరు తొలి వికెట్కు 64 రన్స్ జోడించారు. 17 రన్స్ తేడాతో ఈ ఇద్దరూ ఔటైనా హర్మన్ కీలక భాగస్వామ్యాలతో భారీ స్కోరు అందించింది. రెండో ఎండ్లో నిలకడగా ఆడిన హర్లీన్ డియోల్ (45)తో మూడో వికెట్కు 81 రన్స్ జత చేసి ఔటైంది. ఆ తర్వాత వచ్చిన జెమీమా.. హర్మన్కు అండగా నిలిచింది. ఈ ఇద్దరు ఇంగ్లిష్ బౌలింగ్ను దీటుగా ఎదుర్కొంటూ నాలుగో వికెట్కు 110 రన్స్ జత చేశారు.
46వ ఓవర్లో జెమీమా వెనుదిరిగినా చివర్లో వచ్చిన రిచా ఘోష్ (38 నాటౌట్) దంచికొట్టింది. 82 బాల్స్లో కెరీర్లో ఏడో సెంచరీ పూర్తి చేసిన హర్మన్తో ఐదో వికెట్కు 32 రన్స్ జత చేసింది. ఇంగ్లండ్పై హర్మన్కు ఇది మూడో వంద కావడం గమనార్హం. లారెన్ బెల్, లారెన్ ఫైలర్, చార్లీ డీన్, ఎకిల్స్టోన్, లిన్సే స్మిత్ తలా ఓ వికెట్ తీశారు. తర్వాత ఛేజింగ్కు దిగిన ఇంగ్లండ్ కడపటి వార్తలందేసరికి 37 ఓవర్లలో 210/4 స్కోరు చేసింది. 13 బాల్స్ తేడాలో అమీ జోన్స్ (4), బ్యూమోంట్ (2)ను ఔట్ చేసి క్రాంతి గౌడ్ శుభారంభాన్నిచ్చింది. ఎమ్మా లంబ్ (68), సివర్ బ్రంట్ (98) మెరుగ్గా ఆడారు. సోఫియా డంక్లీ (25 బ్యాటింగ్), అలైస్ డేవిడ్సన్ రిచర్డ్స్ (4 బ్యాటింగ్) ఆడుతున్నారు.