- వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఏటా పెరుగుతున్న యాక్సిడెంట్లు
- రింగ్ రోడ్డుపై నెలకు కనీసం పది ప్రమాదాలు
- శాఖల మధ్య సమన్వయం లేక ఇబ్బందులు
- మాటలకే పరిమితమవుతున్న రక్షణ చర్యలు
హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఏటికేడు యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల సొంత తప్పిదాలతో కొన్ని యాక్సిడెంట్లు జరుగుతుంటే, రోడ్లపై ఇంజినీరింగ్ లోపాలతో మరికొన్ని జరుగుతూ వందల మంది చనిపోతున్నారు. యాక్సిడెంట్ల నియంత్రణకు ఆఫీసర్లు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. వాస్తవానికి రోడ్డు సేఫ్టీ కమిటీ నిర్ణయాల మేరకు తరచూ యాక్సిడెంట్లు జరిగే ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ కొంతకాలంగా రోడ్డు సేఫ్టీ మీటింగ్లే జరగడం లేదు. దీంతో గతంలో గుర్తించిన బ్లాక్ స్పాట్లలోనూ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేకపోతున్నారు.
సగటున ప్రతి రోజు మూడు ప్రమాదాలు
కమిషనరేట్ పరిధిలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలు, ఎన్హెచ్ 163, ఎన్హెచ్ 563 ఉన్నాయి. హైవేలతో పాటు సిటీలోని చాలా రోడ్లపై ఇంజినీరింగ్ లోపాలు కనిపిస్తున్నాయి. దీంతో కమిషనరేట్ పరిధిలో ప్రతి రోజు సగటున మూడు యాక్సిడెంట్లు జరుగుతుండగా, ఒకరు చనిపోతున్నారు. 2021లో 1,117 యాక్సిడెంట్లు జరుగగా 443 మంది చనిపోగా, 1,160 మంది గాయపడ్డారు. అలాగే 2022లో జరిగిన 1,125 ప్రమాదాల్లో 424 మంది చనిపోగా, 1,102 మంది గాయపడ్డారు. ఇందులో 25 నుంచి 35 ఏండ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లే ఎక్కువ. ఇక ఈ ఏడాది మూడు నెలల్లోనే 300 వరకు ప్రమాదాలు జరగగా 80 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
డేంజరస్గా మారిన రింగ్ రోడ్డు
వరంగల్ నగర శివారు నుంచి కరుణాపురం నుంచి దామెర క్రాస్ వరకు ఉన్న ఎన్హెచ్ 163 బైపాస్(రింగ్ రోడ్డు) ప్రమాదాలకు నిలయంగా మారింది. గ్రామాల అప్రోచ్ రోడ్లతో పాటు జంక్షన్ల వద్ద సరైన రక్షణ చర్యలు లేవు. గత నెల 1న పెగడపల్లి క్రాస్ వద్ద ఓ డీసీఎం బైక్ను ఢీకొట్టడంతో ఎల్కతుర్తి మండలం దామెరకు చెందిన వ్యక్తి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. ధర్మసాగర్ పీఎస్ పరిధిలో కారు ఢీకొన్న ప్రమాదంలో 20 గొర్లు మృతి చెందాయి. 9వ తేదీన ఉనికిచర్ల సమీపంలో ఓ కారు బైక్ను ఢీకొట్టగా టూవీలర్పై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. 12వ తేదీన ధర్మసాగర్ పీఎస్ పరిధిలో బైక్ను కార్ ఢీకొట్టగా ఓ యువకుడు చనిపోయాడు. 13న ఉనికిచర్ల వద్ద కారు, బైక్ ఢీకొట్టగా ఇద్దరికి గాయాలయ్యాయి. ధర్మసాగర్ సమీపంలో 17వ తేదీన ఓ ప్రభుత్వ ఉద్యోగి కూడా గాయపడ్డారు. అంతకుముందు ఓ ఐదుగురు టీచర్లు విధులకు హాజరయ్యేందుకు ముచ్చర్ల క్రాస్ మీదుగా వెళ్తుండగా.. బొలేరో వెహికల్ ఢీకొట్టగా ఒకరు చనిపోయారు.
మీటింగుల్లేవ్... రక్షణ చర్యల్లేవ్
వాస్తవానికి రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, ఆర్అండ్బీ, హైవేస్, ఆర్టీఏ, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లతో కూడిన రోడ్డు సేఫ్టీ కమిటీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇటీవలి కాలంలో రోడ్డు సేఫ్టీ మీటింగ్ నిర్వహించిన దాఖలాలే కనిపించడం లేదు. దీంతో పాటు ఎక్కడైనా ప్రమాదం జరిగితే వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు వెంటనే స్పాట్ను విజిట్ అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విశ్లేషించి దాని ప్రకారం చర్యలు చేపట్టాలి. కానీ ఇక్కడ అదేమీ కనిపించడం లేదు. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని పోలీస్ అధికారులు సందర్శించి తాత్కాలిక చర్యలు చేపట్టి వదిలేస్తున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి యాక్సిడెంట్ల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఆఫీసర్లు గుర్తించిన బ్లాక్ స్పాట్లు ఇవే..
వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఆఫీసర్లు మొత్తంగా 24 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. హనుమకొండ జిల్లాలో రింగ్ రోడ్డుపై రాంపూర్ క్రాస్రోడ్డు, టేకులగూడెం క్రాస్ రోడ్డు, వంగపహాడ్ క్రాస్, కాజీపేట జంక్షన్ నుంచి ఫాతిమా జంక్షన్, వడ్డేపల్లి క్రాస్ రోడ్డు నుంచి జులైవాడ, నక్కలగుట్ట జంక్షన్, మర్కజీ స్కూల్ సెంటర్ నుంచి అలంకార్ సెంటర్, పెద్దమ్మగడ్డ జంక్షన్, హంటర్ రోడ్డు రాజ్హోటల్ నుంచి సీఎస్ఆర్ గార్డెన్, భీమారం నుంచి రామారం, హసన్పర్తి పెద్దచెరువు, ఎల్లాపూర్ బ్రిడ్జి, ములుగు రోడ్డు నుంచి హనుమాన్ జంక్షన్, ఆరెపల్లి జంక్షన్. వరంగల్ జిల్లాలో గోపాలస్వామి గుడి నుంచి పోచమ్మమైదాన్, బూడిదగడ్డ జంక్షన్ నుంచి ఫోర్ట్ రోడ్డు జంక్షన్, ఆర్టీవో ఆఫీస్ జంక్షన్, ఇల్లంద శివారు ప్రాంతాలు, మైలారం శివారు, నర్సంపేట ఎంజేఆర్ మిల్ క్రాస్, ధర్మారం, గిర్నిబావి సెంటర్