రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఆరాటం 

రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఆరాటం 

రాష్ట్రంలో బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. సమైక్యాంధ్రలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ప్రాణాలుపణంగా పెట్టి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేలా ముఖ్యమంత్రి ఎంతో కృషి చేశారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెడితే రూ.50 వేల కోట్లు బహుమతిగా ఇస్తామని ఆఫర్ చేస్తుందని చెప్పారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టనివ్వబోమని దయాకర్ రావు స్పష్టం చేశారు. 

పాలకుర్తిలో నిర్వహించిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి.. తెలంగాణ సాయుధ పోరాటంలో, స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర ఏమీ లేదన్నారు. రాష్ట్రానికి ఏం చేయని కమలం పార్టీ.. రాజకీయ లబ్ధి కోసమే జాతీయ సమైక్యత వేడుకలతో రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్య్రం తెచ్చుకున్నామని.. ఆ పోరాటంలో పాలకుర్తి ప్రధాన భూమిక పోషించిందన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పోరాటయోధులు పాలకుర్తి ప్రాంతానికి చెందిన వారే కావడం గర్వకారణంగా ఉందన్నారు. సెక్రటేరియట్ కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా కొత్త పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని దయాకర్ డిమాండ్ చేశారు.