
న్యూఢిల్లీ: ఇండియా యంగ్ షూటర్, హైదరాబాదీ ఇషా సింగ్ ఆసియా ఎయిర్గన్ చాంపియన్షిప్లో సిల్వర్ మెడల్తో మెరిసింది. కొరియాలోని దయెగులో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం ఇండియాకు నాలుగు గోల్డ్ మెడల్స్ లభించాయి. జూనియర్ విమెన్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ 17–15తో ఇషాను ఓడించి గోల్డ్ నెగ్గింది. ఇషాకు సిల్వర్ దక్కింది.
సీనియర్ విమెన్ 10 మీ. ఎయిర్ పిస్టల్లో రిథమ్ సాంగ్వాన్ 16–8తో ఇండియాకే చెందిన పాలక్ను ఓడించి స్వర్ణం గెలిచింది. 10 మీ. ఎయిర్ పిస్టల్ మెన్స్ టీమ్ ఈవెంట్లో శివ నర్వాల్, నవీన్, విజయ్వీర్ సిద్దుతో కూడిన ఇండియా 16–14తో కొరియా జట్టును ఓడించి చాంపియన్గా నిలిచింది. జూనియర్ మెన్స్ టీమ్ ఈవెంట్లో సామ్రాట్ రాణా, వరుణ్ తోమర్, సాగర్ దంగితో కూడిన ఇండియా కూడా గోల్డ్ గెలిచింది.