రూ.500 కోట్లతో పామాయిల్​ ఫ్యాక్టరీ .. శంకర్​పల్లిలో ఏర్పాటు చేస్తున్న మ్యాట్రిక్స్​

రూ.500 కోట్లతో పామాయిల్​ ఫ్యాక్టరీ .. శంకర్​పల్లిలో ఏర్పాటు చేస్తున్న మ్యాట్రిక్స్​
  • ఇయ్యాల భూమి పూజ చేయనున్న మంత్రి కేటీఆర్​
  • వచ్చే ఏడాది మినీ మిల్​అందుబాటులోకి... రెండేండ్లలో పూర్తి
  • రెండు జిల్లాల్లో పెరుగనున్న ఆయిల్​ పామ్​ సాగు విస్తీర్ణం 

మంచిర్యాల, వెలుగు :  ఆయిల్​ పామ్​ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పామాయిల్​ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందడుగు పడ్డది. మ్యాట్రిక్స్​ కంపెనీ ఆధ్వర్యంలో మందమర్రి మండలంలోని శంకర్​పల్లి వద్ద ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. మూడేండ్ల కిందటే మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఆదివారం జిల్లా పర్యటనకు వస్తున్న రాష్ట్ర మున్సిపల్, ఐటీ మినిస్టర్​ కేటీఆర్​ భూమిపూజ చేసి  పనులు స్టార్ట్​ చేయనున్నారు.

70 ఎకరాల్లో రూ.500 కోట్లతో శంకర్​పల్లి వద్ద పామాయిల్​ ఫ్యాక్టరీని మ్యాట్రిక్స్​ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. దీనిని రెండు విడతల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. తొలి విడతలో ఏడాదిలోపే పామాయిల్​ మిల్​ను ప్రారంభించి, రెండో విడతలో రిఫైనరీని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా 500 మందికి ఉపాధి దొరుకుతుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మొదట జైపూర్​ మండల కేంద్రంలోని నర్సరీ వద్ద పామాయిల్​ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ తర్వాత దానిని మందమర్రి మండలంలోని శంకర్​పల్లికి మార్చారు.   

పెరుగనున్న సాగు విస్తీర్ణం

మనదేశంలో పామాయిల్​ ఉత్పత్తి తక్కువగా ఉండడంతో మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్​ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఆయిల్​ పామ్​ సాగును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం రైతులను ఈ పంటవైపు మళ్లిస్తోంది. జిల్లాలో 2020లో ప్రయోగాత్మకంగా సాగు ప్రారంభించారు. ఇప్పటివరకు 2,800 ఎకరాల్లో సాగైంది. కుమ్రం భీమ్​ ఆసిఫాబాద్​ జిల్లాలో 900 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో 5వేల ఎకరాలకు చేరుకునే అవకాశముంది.  

ఏడాదిలోగా మినీ మిల్లు సిద్ధం  

రాష్ట్ర ప్రభుత్వం సహకారంలో జిల్లాలో ఆయిల్​ పామ్​ సాగు చేపట్టడంతో పాటు శంకర్​పల్లి వద్ద పామాయిల్​ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నాం. 70 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్లతో నిర్మిస్తున్నాం. వచ్చే ఏడాదిలోగా మినీ మిల్లును రెడీ చేస్తాం. ఆ తర్వాత సంవత్సరంలోగా రిఫైనరీ  ఏర్పాటు చేస్తాం.  

- ఉదయ్​కుమార్​, మ్యాట్రిక్స్​ కంపెనీ సీఈవో