నా మాటల్నివక్రీకరించారు..మా నాయకుడు కేసీఆరే: ఈటల

నా మాటల్నివక్రీకరించారు..మా నాయకుడు కేసీఆరే: ఈటల

హుజురాబాద్ లో తన ప్రసంగాన్ని సోషల్ మీడియాలో కొన్నివర్గాలు వక్రీకరించాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ‘‘మా నాయకుడు కేసీఆర్. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ముమ్మాటికీ గులాబీ జెండానే ఎగురుతుంది. నేను పార్టీలో చేరిన నాటి నుంచి నేటి వరకు గులాబీ సైనికుడినే” అని గురువారం రాత్రి ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీఆర్​ఎస్​ అంటే గిట్టనివాళ్లు, తన ఎదుగుదలను ఓర్వలేనివారు ఇటీవల కొన్ని పత్రికల్లో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను ఒక కులానికి ప్రతినిధి అన్నట్లుగా, డబ్బులకు ఆశపడే వ్యక్తి అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్  సభలో మాట్లాడానని తెలిపారు. నిరాధారమైన వార్తలను ప్రసారం చేయడం ఆపాలని, సోషల్ మీడియా సంయమనంతో ఉండాలని పేర్కొన్నారు.