హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్తో చర్చించి కరోనా ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ చెప్పారు. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లలో అధిక చార్జీలు వేయొద్దని హెచ్చరించామని, ఫీజుల జీవోను ఉల్లంఘించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సోమవారం తనను కలిసిన రిపోర్టర్లతో ఆయన ఈ విషయాలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వేగంగా స్ర్పెడ్ అవుతోందని, కట్టడికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈటల పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ను ఈ కాన్ఫరెన్స్లో ప్రారంభించారు.
మూడేండ్లుగా ఈ పోర్టల్ను పైలట్ ప్రాజెక్ట్గా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పరిశీలించారు. దేశంలో ఎక్కడ ఎవరికి ఏ జబ్బు వచ్చినా ఈ పోర్టల్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పేషెంట్ పేరు, ఫోన్ నంబర్ సహా పూర్తి చిరునామా ఎంటర్ చేయగానే ఆధార్ తరహాలో ఒక యూనిక్ ఐడీ క్రియేట్ అవుతుంది. దీంతో ఏ హాస్పిటల్కు పోయినా పాత రిపోర్టులను చూసి, డాక్టర్లు అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వొచ్చు. ఈ పోర్టల్లో 33 రకాల అంటువ్యాధుల వివరాలను రియల్ టైంలో నమోదు చేస్తున్నట్టు మంత్రి ఈటల వెల్లడించారు. ఈ పోర్టల్ వినియోగంపై ఇప్పటికే కొంత మంది ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లకు ట్రైనింగ్ కూడా ఇప్పించినట్లు చెప్పారు.