ఈటలతో మాటల్లేవ్!: హైకమాండ్ కు భయపడుతున్న నేతలు

ఈటలతో మాటల్లేవ్!: హైకమాండ్ కు భయపడుతున్న నేతలు

ఆయనను కలిస్తే పార్టీ హైకమాండ్​
ఏమంటుందోనని భయం
వాట్సప్​లో మాట్లాడుతున్న పలువురు నేతలు

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కలిసేందుకు కొందరు టీఆర్​ఎస్​ నాయకులు జంకుతున్నారు. ఆయన ఎదురైనా చూసీచూడనట్లు వెళ్లిపోతున్నారు. ‘‘గులాబీ జెండా ఓనర్లం మేమే’’ అంటూ ఆగస్టు 29న మంత్రి ఈటల హుజురాబాద్ లో మాట్లాడిన మాటలు పార్టీలో దుమారం రేపాయి. అప్పట్నుంచి ఆయనను కలిసేందుకు టీఆర్ఎస్​ నాయకులు పెద్దగా చొరవ చూపడంలేదు. వైద్యశాఖకు చెందిన పని ఉన్నా ఈటల దగ్గరకు వెళ్లడం లేదు.  ఒకవేళ వెళ్తే ప్రగతిభవన్ వర్గాలు, తెలంగాణ భవన్​ వర్గాలు ఏమంటాయోనని వారు భయపడుతున్నట్లు టీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ‘‘గులాబీ జెండా ఓనర్  కేసీఆర్ మాత్రమే’’నని ఆగస్టు 31న మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు వ్యాఖ్యానించారు.

అదే రోజు జలవిహార్ లో జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్  హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి మంత్రి ఈటల రాజేందర్ కూడా వెళ్లారు. ఈటలతో ఆ ఇద్దరు మంత్రులు పెద్దగా మాట్లాడలేదని, ఏదో విష్​ చేశామా అంటే చేశామన్నట్లు పలుకరించారని కార్యక్రమానికి హాజరైన ఓ నాయకుడు తెలిపారు. ముగ్గురు మంత్రులు పక్కపక్కనే కూర్చున్నా.. అంత చనువుగా మాట్లాడుకున్నట్లు కనిపించలేదని అన్నారు. హుజురాబాద్ లో ఈటల మాట్లాడిన మరుసటి రోజే ఆయన ఇంటికి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​  వెళ్లారు. ఈ ఇద్దరి భేటీపై మీడియాలో వార్తలు రావడంతో.. ఆ తర్వాత రోజు నుంచి రసమయి కూడా మళ్లీ ఈటలను కలువనట్లు తెలుస్తోంది.

ఈటలను కలుస్తున్న వారిపై నిఘా?

మంత్రి ఈటల రాజేందర్ ను కలుస్తున్న నాయకులపై నిఘా ఉందని టీఆర్​ఎస్​లో ప్రచారం జరుగుతోంది. మంత్రిని కలిసి ఏం మాట్లాడుతున్నారు? ఏ విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి? అని కొందరు పెద్దలు ఆరా తీస్తున్నట్లు గులాబీ కేడర్​లో చర్చ నడుస్తోంది. రెండు రోజుల క్రితం తెలంగాణభవన్​లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి అంబర్​పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్​తోపాటు మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రాలేదు. మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలోని ఫీవర్ ఆస్పత్రికి వస్తున్నారని, అందుకే   పార్టీ మీటింగ్ కు రాలేదని తెలంగాణ భవన్ వర్గాలకు కాలేరు వెంకటేశ్​ సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కేటీఆర్​ కాలేరుపై సీరియస్​ అయినట్లు తెలిసింది. పార్టీ మీటింగ్ కంటే ఆ కార్యక్రమం పెద్దదా అని ప్రశ్నిస్తూ.. సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలందరి నుంచి వివరణ తీసుకోవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆదేశించినట్లు సమాచారం.

ఎవరి దారి వారిదే..!

బుధవారం హైదరాబాద్​లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్​ పాల్గొన్నారు. ఆయనతోపాటు మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు. కార్యక్రమం పూర్తికాగానే మల్లారెడ్డి, రామ్మోహన్​ ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. సహజంగా ఇద్దరు ముగ్గురు నాయకులు ఒకే కార్యక్రమానికి వెళ్తే కార్యక్రమం తర్వాత కాసేపు మాట్లాడుకుంటారు. కానీ.. అక్కడ అలాంటి సీన్​ ఏమీ కనిపించలేదు. ఈటల ఆ కార్యక్రమం ముగించుకొని మరో కార్యక్రమానికి వెళ్లారు.

వాట్సప్  కాల్స్ కే పరిమితం!

ఈటలను నేరుగా కలిసి మాట్లాడితే ఎక్కడ తమపై పార్టీ సీరియస్​ అవుతుందోనని కొందరు నేతలు వెనుకడుగు వేస్తున్నారు. ఫోన్​లోనైనా పలుకరిద్దామనుకుంటే.. ఫోన్​ ట్యాపింగ్​ అవుతుందేమోనని భయపడుతున్నారు. వాట్సాప్​ కాల్​ చేస్తే  పెద్దగా సమస్య ఉండదని భావించి.. ఆ మార్గంలో పలుకరిస్తున్నారు. హుజురాబాద్ ఘటన తర్వాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్​ను  వాట్సప్ లో అభినందించినట్లు సమాచారం. చాలా బాగా మాట్లాడరని.. అందరూ మెచ్చుకుంటున్నారని ఆయనను ప్రశంసించినట్లు తెలిసింది.