ప్రైవేట్కు ఈవీ చార్జింగ్ స్టేషన్లు!.. పనితీరు మెరుగుకే అంటున్న అధికారులు

ప్రైవేట్కు ఈవీ చార్జింగ్ స్టేషన్లు!..  పనితీరు మెరుగుకే అంటున్న అధికారులు
  •  పనితీరు మెరుగుకే అంటున్న అధికారులు 
  •  గ్రేటర్​లో రెడ్కో ఆధ్వర్యంలో 150 చార్జింగ్ స్టేషన్లు
  • నిర్వహణ లోపాలతో సమస్యలు
  •  ప్రైవేటు అప్పగించాలని ఇప్పటికే టెండర్లు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​లో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్​వాహనాలు పెరుగుతున్నా.. అందుకు తగ్గట్టుగా ఈవీ చార్జింగ్ స్టేషన్ల​సంఖ్య పెరగడం లేదు. చార్జింగ్ స్టేషన్లలో నిర్వహణ లోపంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సాంకేతిక సమస్యలతో తరచూ ఈవీ చార్జింగ్ స్టేషన్ల వద్ద రద్దీ కనిపిస్తున్నది. 

ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ రెన్యువబుల్​ఎనర్జీ డెవలప్మెంట్​కార్పొరేషన్​(టీజీ​రెడ్కో) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈవీ స్టేషన్లను ప్రైవేట్​కు అప్పగిస్తే ఆయా సమస్యలకు చెక్​పెట్టడంతోపాటు వాటి పని తీరును మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని రెడ్కో అధికారులు భావిస్తున్నారు.ఇప్పటికే ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించారు. దేశ వ్యాప్తంగా ఈవీ స్టేషన్ల నిర్వహణలో 2.5 కోట్ల టర్నోవర్​ఉన్న ప్రైవేట్​సంస్థలు ఈ టెండర్లలో పాల్గొవచ్చని పేర్కొన్నారు. 

యూనిట్​చార్జీ పెరుగుతుందా?

ప్రస్తుతం గ్రేటర్​లో టీజీ​రెడ్కో ఆధ్వర్యంలో150 చోట్ల ఈవీ చార్జింగ్​స్టేషన్లు(60 కి.వాట్స్​డ్యూయల్​గన్స్​) ఉండగా, ప్రైవేట్​సంస్థలకు సంబంధించి మరో 450 ఉన్నాయి. రెడ్కో నిర్వహిస్తున్న ఈవీ స్టేషన్లలో వాహనాలకు చార్జింగ్​ చేసినందుకు యూనిట్​కు రూ.13 వసూలు చేస్తున్నారు. అదే ప్రైవేట్​ కంపెనీలకు చెందిన చార్జింగ్​ స్టేషన్లలో అయితే యూనిట్​కు రూ.26 వసూలు చేస్తున్నారు. అయితే రెడ్కో అధికారులు తమ ఈవీ స్టేషన్లను ప్రైవేట్​సంస్థలకు అప్పగిస్తే ప్రస్తుతం వసూలు చేస్తున్న యూనిట్​చార్జీ పెరుగుతుందా? దానినే కొనసాగిస్తారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

భారీగా పెరుగుతున్న ఈవీ వెహికల్స్

2024 అక్టోబరు నెలలో 38,955 టూవీలర్ల అమ్మకాలు జరగగా, ఇందులో దాదాపు 25 శాతం ఈవీ ఉన్నట్టు అధికారులు తెలిపారు. అలాగే కార్లు 9768 అమ్మకాలు జరగగా, ఇందులో 50 శాతానికి పైగా ఈవీ కార్లే ఉన్నట్టు సమాచారం. ఇక క్యాబ్స్​ 856  అమ్మకాల్లోనూ ఎక్కువగా ఈవీ వాహనాలే ఉన్నట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 10 నాటికి అమ్మకాల తీరును పరిశీలిస్తే 41,080 టూవీలర్లు అమ్మకాల్లో 30 శాతం, 13,022 కార్ల అమ్మకాల్లో 40 శాతం వరకూ ఈవీ వాహనాలు ఉన్నట్టు తెలిపారు. 

ఇక క్యాబ్స్​1,224 అమ్మకాలు జరిగినట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఇందులో కూడా అత్యధిక శాతం ఈవీలేనని అంటున్నారు. డిసెంబర్ ఆఖరు నాటికి ఈ సంఖ్య  మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా చార్జింగ్​ స్టేషన్​లను పెంచాలని భావిస్తున్నారు.