కర్నాకటలో బీజేపీ ఓటు షేర్​ తగ్గింది 0.2 శాతమే.. కాంగ్రెస్​కు కలిసొచ్చిన ఓట్ల చీలిక

కర్నాకటలో బీజేపీ ఓటు షేర్​ తగ్గింది 0.2 శాతమే.. కాంగ్రెస్​కు కలిసొచ్చిన ఓట్ల చీలిక
  • బీజేపీ ఓటు షేర్​ తగ్గింది 0.2 శాతమే

  • కేఆర్‌‌‌‌పీపీతో సీట్లకు గండి కొట్టిన గాలి జనార్దన్ రెడ్డి

  • ఆ పార్టీ పోటీ చేసిన చోట్ల బీజేపీ మూడో స్థానానికి

  • కాంగ్రెస్​కు కలిసొచ్చిన ఓట్ల చీలిక

  • ఓటు బ్యాంకును నిలబెట్టుకున్న బీజేపీ

న్యూఢిల్లీ : కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓడినా.. ఓటు బ్యాంకును నిలబెట్టుకుంది. సీట్లు తగ్గినా ఓట్ల షేర్‌‌‌‌ను గత ఎన్నికల మాదిరే రాబట్టింది. 2018 ఎన్నికల్లో 36.22 % ఓట్లు రాగా.. ఈ సారి 36 % వచ్చాయి. అంటే కేవలం 0.22 శాతమే తగ్గింది. ఓట్ల చీలిక ఎఫెక్ట్ కాంగ్రెస్‌‌కు కలిసి వచ్చింది. హస్తం పార్టీకి గత ఎన్నికల్లో 38.1% ఓట్లు పడగా, ఈ సారి 42.88% పడ్డాయి. అంటే 5 శాతం షేర్ పెరిగింది. ఈ పెరిగిన షేర్ మొత్తం జేడీఎస్‌‌దే. కుమారస్వామి పార్టీ ఈ ఎన్నికల్లో 5 శాతం పైగా ఓట్లను కోల్పోయింది.  2018లో 18.36% ఓట్లు పడగా, ఈ సారి 13.29%కి తగ్గింది. 

చీలిన ఓట్లతో తగ్గిన సీట్లు

ఓట్లు తగ్గకున్నా.. సీట్లు మాత్రం బీజేపీకి భారీగా తగ్గిపోయాయి. గత ఎన్నికల్లో 104 స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ఈసారి 65 సీట్ల దగ్గరే ఆగిపోయింది. అంటే 39 సీట్లు తగ్గాయి. అయితే ఓట్ల చీలిక వల్లే చాలా చోట్ల బీజేపీ ఓడిపోయింది. ఉదాహరణకు బళ్లారి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి జనార్దన్ రెడ్డి హవా ఎక్కువ. ఆయన ఈ సారి ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్‌‌‌‌పీపీ)’ పేరుతో సొంత పార్టీని పెట్టుకున్నారు. ఆయన, ఆయన భార్యతోపాటు మొత్తం 47 మంది పోటీ చేశారు.

గాలి జనార్దన్‌‌రెడ్డి తప్ప మిగతా వారందరూ ఓడిపోయారు. కానీ ఓట్లను భారీగా చీల్చారు. బీజేపీ తరఫున పోటీ చేసిన ఆయన సొంత సోదరులు గాలి సోమశేఖరరెడ్డి, గాలి కరుణాకరెడ్డి ఓటమికీ కారకులయ్యారు. కేఆర్‌‌‌‌పీపీ పోటీ చేసిన చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులు మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం. బీజేపీని దెబ్బ కొట్టిన కేఆర్‌‌‌‌పీపీ.. పరోక్షంగా కాంగ్రెస్‌‌కు లబ్ధి చేకూర్చింది. ఈ అనుకూల పరిణామంతో చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.