
కేపీహెచ్బీకాలనీ బస్టాప్వద్ద పాదాచారులు రోడ్డు దాటేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అక్కడ ట్రాఫిక్సిగ్నల్ పనిచేయకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు దాటకుండా డివైడర్ మధ్యలో ఉన్న ఖాళీ స్థలాన్ని భారీకేడ్లు పెట్టి మూసివేశారు. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్బ్రిడ్జిని ఉపయోగించుకోవాలని అక్కడ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. కానీ బస్టాప్నుంచి ఫుట్ఓవర్బ్రిడ్జి 200 మీటర్ల దూరంలో ఉండడంతో అంత దూరం వెళ్లలేక మూసి ఉన్న దారి గుండానే ప్రమాదకరంగా డివైడర్ఎక్కి రోడ్డు దాటుతున్నారు. బస్టాప్పక్కనే ఉన్న మెట్రో స్టేషన్ మెట్ల గుండా కూడా వెళ్లవచ్చని తెలిసిన కూడా ప్రజలు ఎవరూ అలా వెళ్లకుండా ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నారు. సిగ్నల్ లేకపోవడంతో వాహనదారులు వేగంగా వస్తుంటారు. ఇదే సమయంలో ప్రజలు డివైడర్ఎక్కి అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో వాహనదారులు వాహనాలను అదుపుచేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు.
పత్తాలేని ట్రాఫిక్ పోలీసులు…
బస్టాప్ వద్ద పాదాచారులు ఎవరూ రోడ్డు దాటకుండా డివైడర్ మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ ప్రజలు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ప్రమాదకరంగా రోడ్డును దాటుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహించాల్సిన ట్రాఫిక్ సిబ్బంది మాత్రం ఎక్కడ కనబడడం లేదు. దీంతో పాదాచారులకు అవగాహన కల్పించేందుకు, రోడ్డును అడ్డదిడ్డంగా దాటకుండా ఫుట్ఓవర్ బ్రిడ్జి ఉపయోగించుకునేలా సూచనలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎవరూ అక్కడ కనిపించడం లేదు. కొందరూ మహిళలు చంటి పిల్లలను ఎత్తుకొని ప్రమాదకరంగా రోడ్డు క్రాస్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు స్పందించి ఎవ్వరు కూడా ప్రమాదకరంగా రోడ్డు దాటకుండా పక్కనే ఉన్న ఫుట్ ఒవర్ బ్రిడ్జిని ఉపయోగించునేలా చర్యలు తీసుకోవాలి.
సలహాలు ఇచ్చేందుకు ట్రాఫిక్సిబ్బంది లేరు..
సిగ్నల్ పనిచేయడం లేదని పాదాచారులు రోడ్డు దాటకుండా రోడ్డు మధ్యలో ఉన్న ఖాళీ స్థలాన్ని క్లోజ్ చేశామని ట్రాఫిక్ పోలీసులు సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించుకోవాలని తెలిపారు. అయితే వృద్ధులు, నడవలేని వారు, చంటి పిల్లలతో ఉన్న మహిళలు అంత దూరం వెళ్లలేక డివైడర్ఎక్కి రోడ్డు క్రాస్ చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడు పునరుద్ధరించి ఓపెన్ చేస్తారని ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేయగా తెలియదని అంటున్నారు. కనీసం బస్టాప్ వద్ద సూచనలు సలహాలు ఇచ్చేందుకు ట్రాఫిక్ సిబ్బంది కూడా లేరు.