కామారెడ్డి : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను అందరూ వ్యతిరేకించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కామారెడ్డి జిల్లా టెక్రియల్ చౌరస్తా వద్ద నిర్వహించిన రైతుల ధర్నాలో పాల్గొన్న ఆమె.. రైతు వ్యతిరేక బిల్లులకు వతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు చేస్తున్న ఉద్యమం మనం మద్దత్తు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
కేసీఆర్ రైతులంటే ప్రాణమని, రైతులను కడుపులో పెట్టుకుని చూసే వ్యక్తి కేసీఆర్ అయితే.. రైతులను నడ్డి విరిచే విధంగా ప్రధాని మోడీ గారి పాలన సాగుతుందన్నారు. రైతుల పక్షాన నిలబడ్డది ఎవరు, రైతుల నడ్డి వీరిచే విధంగా బిల్లులు తేస్తుందేవరనేది మన రైతులు ఆలోచించాలన్నారు.
మోడీ వల్ల మరోసారి దేశం మొత్తం రోడ్డెక్కిందని, కొత్త వ్యవసాయ చట్టాలను అందరూ వ్యతిరేకించాలని ఆమె అన్నారు. గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని అబద్దాలు చెప్పారు. అబద్దాలు చెప్పే బీజేపీ నాయకులు రైతులకు ఏం న్యాయం చేస్తారు అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు మాటలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదని కవిత మండిపడ్డారు.