-
రైల్వే లైన్స్, రోడ్ల పనులకు శంకుస్థాపన.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగం
-
పరిసరాలను ఆధీనంలోకి తీసుకున్న ఎస్పీజీ
-
2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు
-
సభకు ఆటంకాలు సృష్టిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్
గోదావరిఖని, వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ రామగుండం పర్యటనకు సర్వం సిద్ధమైంది. రామగుండం ఫర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ను శనివారం ఆయన జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం అక్కడే ఎన్టీపీసీ స్టేడియంలో జరిగే సభలో ప్రసంగిస్తారు. ప్రధాని సభా వేదికతో పాటు ఆఫీసర్లు, రైతులు, ప్రజలు కూర్చునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. వేదిక మీద ప్రధాని, కేంద్ర మంత్రులు, ఎంపీలుంటారు. వేదికపై మూడు, వేదిక కింద ఆరు చోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు, సీనియర్ ఆఫీసర్ల కోసం నాలుగు చోట్ల తాత్కాలిక వెయిటింగ్ రూమ్లను రెడీ చేశారు. సభ ప్రాంతాన్ని ఎస్పీజీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
అనుమానితులను పసిగట్టేందుకు సభా ప్రాంగణంలోనూ, చుట్టు పక్కలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భద్రత ఏర్పాట్ల కోసం రామగుండం కమిషనరేట్ పరిధితోపాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి 2,500 మంది పోలీసులు ఎన్టీపీసీకి చేరుకున్నారు. సభలో గానీ, స్టేడియం బయట గానీ ఎవరైనా ఆటంకాలు సృష్టిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు.
రెండు గేట్ల ద్వారా సభలోకి అనుమతి
ప్రధాని సభకు హాజరయ్యే వారిని రెండు గేట్ల ద్వారా లోపలికి అనుమతిస్తారు. ఆర్ఎఫ్సీఎల్, రైల్వే, రోడ్స్, హైవేస్, ఎన్టీపీసీ, సింగరేణి ఆఫీసర్లు, ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు ప్రత్యేక పాస్లు జారీ చేశారు. వీరు టౌన్ షిప్ ఏ టైప్ గేట్ నుంచి, ప్రజలు బీ టైప్ గేట్ నుంచి సభప్రాంగణంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. ప్రధాని, అతిథులు వేదిక వద్దకు రాకముందే ప్రజలు, ఆఫీసర్లు సభా ప్రాంగణానికి చేరుకోవాలని రామగుండం సీపీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, సీనియర్ లీడర్లు దుగ్యాల ప్రదీప్ కుమార్, సోమారపు సత్యనారాయణ, సంగప్ప, పి.మల్లికార్జున్, రావుల రాంనాథ్, కౌశిక హరి తదితరులు సభా ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు.
ఇదీ ప్రధాని షెడ్యూల్
శుక్రవారం రాత్రి ఏపీకి చేరుకున్న ప్రధాని మోడీ.. శనివారం ఉదయం అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ఏపీ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడ కాసేపు బీజేపీ శ్రేణులతో మాట్లాడుతారు. ఆ తర్వాత ఆయన బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 3.10 గంటలకు రామగుండం వస్తారు. 3.20 గంటలకు ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్కు చేరుకొని 3.35 గంటల వరకు అక్కడే ఉండి.. ప్లాంట్ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం 3.45 గంటలకు ఎన్టీపీసీస్టేడియంలోని సభా వేదిక వద్దకు వస్తారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం (భద్రాచలం రోడ్) , సత్తుపల్లి మధ్య నిర్మించిన 60 కిలోమీటర్ల రైల్వే లైన్ను, మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్, హైవేస్ ఆధ్వర్యంలో 133 కిలోమీటర్ల మెదక్, సిద్దిపేట, ఎల్కతుర్తి రోడ్డు, 17 కి.మీ సిరివంచ, మహాదేవపూర్ రోడ్డు, 56 కి. మీ బోధన్, బాసర రోడ్డు పనులకు వీడియో కాన్ఫరెన్స్లో శంకుస్థాపన చేస్తారు. 4 గంటలకు సభలో మాట్లాడతారు. 4.50 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్కు వెళ్తారు.