అరాచక శక్తులను తరిమికొట్టాలి : తుమ్మల నాగేశ్వరరావు

అరాచక శక్తులను తరిమికొట్టాలి : తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం రూరల్, వెలుగు: జిల్లాలోని అరాచక శక్తులను తరిమికొట్టాలని, ఐదేండ్లుగా ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న బీఆర్ఎస్​ప్రభుత్వంతో జనం విసుగు చెందారని మాజీ మంత్రి, కాంగ్రెస్​నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఆదివారం ఖమ్మం రూరల్​మండలం రాజీవ్​గృహకల్ప వద్ద నిర్వహించిన మున్నేరు స్విమ్మింగ్ మిత్రుల ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్​వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. 

జిల్లాలో ఆదర్శ కమ్యూనిస్టు బోడేపుడితో కలిసి పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత రాజకీయాలు ఎబ్బెట్టుగా మారాయని అసహనం వ్యక్తం చేశారు. ప్రజల కోరిక మేరకే తాను ఎన్నికల బరిలో ఉన్నానని చెప్పారు. కాంగ్రెస్​హైకమాండ్​ఆదేశాలతో ఖమ్మం నుంచి తాను,  పాలేరు నుంచి పొంగులేటి పోటీ చేస్తున్నామని తెలిపారు. సోనియా గాంధీ కుటుంబం వల్లే తెలంగాణ సాకారం అయ్యిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, చారిత్రక తీర్పు ఇవ్వాలని కోరారు.