
హైదరాబాద్, వెలుగు: ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లపై టీఆర్ఎస్, బీజేపీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని మాజీ మంత్రి షబ్బీర్ అలీ మండిపడ్డారు. బుధవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెట్టినపుడే అది డ్రామా అని చెప్పానని, కేసీఆర్ కూడా కేంద్రం నుంచి బిల్లు వాపస్ వస్తుందని తనతో అన్నారని గుర్తు చేశారు. ఇది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రిజర్వేషన్లు ఎందుకు పెంచాలో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కారును వివరణ కోరుతూ మూడు సార్లు లేఖలు రాసిందని చెప్పారు. కానీ, టీఆర్ఎస్ సర్కార్ కూడా ఏ ఒక్క లేఖకు సమాధానం ఇవ్వలేదని అన్నారు. అంతేకాకుండా బీసీ కమిషన్ ఇచ్చిన రిపోర్టుకు వ్యతిరేకంగా రిజర్వేషన్ల బిల్లు పంపారని అన్నారు. గిరిజనులకు 9.08 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించడం సమంజసంగా ఉండేదన్నారు.