కొత్త పార్టీ పెట్టాలా? లేకపోతే బీజేపీలో చేరాలా?

కొత్త పార్టీ పెట్టాలా? లేకపోతే బీజేపీలో చేరాలా?

కొత్త పార్టీ పెట్టాలా? లేకపోతే ఎవరైనా కొత్త పార్టీ పెడితే వారితో కలిసి పనిచేయాలా? లేక బీజేపీలో చేరాలా అని ఆలోచిస్తున్నానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన.. ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ మూడేళ్లు వెంటబడితేనే తాను రాజకీయాల్లోకి వచ్చానని కొండా అన్నారు. తాను రాజకీయాలలోకి అనుకోకుండా వచ్చానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షం కాదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. 

‘కాంగ్రెస్‌లో గ్రూపులు ఎక్కువయ్యాయనే పార్టీ మారాను. ఎన్నికలకు ముందు సగం మంది కాంగ్రెస్ నేతలు అమ్ముడుపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొంతమంది లీడర్లను కలుస్తున్నాను. ఈ మద్యే కొదండ రాం, తీన్మార్ మల్లన్న, రాములు నాయక్ లాంటి వాళ్లను కలిశాను. అదేవిధంగా కొంతమంది కులసంఘాల నాయకులను కూడా కలిశాను. టీఆర్ఎస్ మంత్రి ఈటల రాజేందర్ అపాయింట్‌మెంట్ కూడా అడిగాను. ఆయనను త్వరలోనే కలుస్తాను. ఈటల బయటకి తిడుతున్నాడు.. మళ్లీ వారితో కలుస్తున్నాడు. సీఎం కేసీఆర్.. ఈటలతో కూడా పార్టీ పెట్టించొచ్చు.

నేను  ఏ నిర్ణయం వెంటనే తీసుకోను అని మూణ్ణేళ్ల కిందే చెప్పాను. ఈ సమయంలో అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకే ఒక ప్రాంతీయ పార్టీ ఉంది. ఒకటే ప్రాంతీయ పార్టీ ఉంటే రాష్ట్రానికి మేలు జరగదు. కాబట్టి రాష్ట్రంలో రెండో ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది. అయితే ప్రాంతీయ పార్టీలు కూడా మరీ ఎక్కువైతే మళ్లీ టీఆర్ఎస్‌కే లాభం చేకూరుతుంది. అందుకే కొత్త పార్టీ పెట్టాలా? లేకపోతే ఎవరైనా కొత్త పార్టీ పెడితే వారితో కలిసి పనిచేయాలా? లేక బీజేపీలో చేరాలా అని ఆలోచిస్తున్నా. ఇవన్నీ కుదరకపోతే మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరాలా అని ఆలోచిస్తున్నా. కానీ, షర్మిల పార్టీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేరను. షర్మిల పార్టీ తెలంగాణ వ్యతిరేకి. కార్యకర్తలు, ప్రజలు, నాయకులతో మాట్లాడి నా రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటాను. అప్పటివరకు స్థానిక సమస్యలపై పోరాడతాను. ప్రభుత్వ తప్పులను ప్రజలలోకి తీసుకెళ్తాను. తెలంగాణలోనే కాకుండా మిగతా రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ బలహీనపడుతోంది. జీ 23లో ఉన్నది 23 మంది సీనియర్లు కాదు. వాళ్లు మొత్తం 50 మంది. కానీ సంతకాలు చేసింది మాత్రం 23 మంది. ఢిల్లీలో చేసిన రైతు ఆందోళనల వల్ల కాంగ్రెస్‌కు మంచి అవకాశమొచ్చింది. కాంగ్రెస్ పార్టీ తీసుకొనే తప్పుడు నిర్ణయాల వల్ల బీజేపీకి మంచి జరుగుతుంది’ అని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.