
పుణే: మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభాపాటిల్కు అరుదైన గౌరవం దక్కింది. మెక్సికో ప్రభుత్వం ఆమెను ఆ దేశ ఉన్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ది ఏజ్టెక్ ఈగల్’తో సత్కరించింది. దేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి (2007–12) గా సేవలు అందించి చరిత్ర సృష్టించినందుకు ఈ అవార్డును ఇచ్చారు. పూణేలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భారత్లో మెక్సికో రాయబారి మెల్బా ప్రియా ఈ అవార్డును ప్రతిభా పాటిల్కు అందించారు. మెక్సికో, ఇతర దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరిచేందుకు కృషి చేసే విదేశీ నేతలకు ఇచ్చే ఈ పురస్కారాన్ని అందుకున్న రెండో ఇండియన్ ప్రతిభాపాటిల్. అంతకుముందు మాజీ రాష్ట్రపతి ఎస్. రాధాకృష్ణను ఈ పురస్కారంతో సత్కరించామని మెక్సికో అధికార ప్రతినిధి చెప్పారు.