టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించే ఉద్దేశం లేదు

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించే ఉద్దేశం లేదు

హైదరాబాద్ : హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించాలన్న ఉద్దేశం లేదని ఎక్సైజ్ శాఖ హైకోర్టుకు తెలిపింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్పై హైకోర్టు విచారణ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కౌంటర్ దాఖలు చేశారు. మార్చి 21న ఈడీకి 828 పేజీల వివరాలతో పాటు , కోర్టులకు సమర్పించిన డిజిటల్ సాక్ష్యాలు, కెల్విన్ కేసులో సేకరించిన వాట్సాప్ స్క్రీన్ షాట్లు ఈడీకి ఇచ్చినట్లు కోర్టుకు తెలిపారు. దర్యాప్తు అధికారులు నిందితుల కాల్ డేటా రికార్డులు సేకరించలేదని, కెల్విన్ కేసులో సిట్ సేకరించిన 12 మంది కాల్ డేటా, విచారణకు సంబంధించిన వీడియో రికార్డింగులను ఈడీకి ఇచ్చినట్లు ఎక్సైజ్ శాఖ ధర్మాసనం దృష్టికి తెచ్చింది. 

పాలనాపరమైన కారణాల వల్ల ఈడీకి సమాచారం ఇవ్వడం కొంత ఆలస్యమైందని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాల అమలులో కొంత ఆలస్యమైనందున బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈడీ విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, కోర్టు ధిక్కరణ కేసు కొట్టివేయాలని అభ్యర్థించారు. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన వివరాలు కోర్టు ఆదేశాల మేరకు ఉన్నాయో లేదో పరిశీలించాలన్న ఈడీ.. ధిక్కరణ పిటిషన్పై వాదనలకు మరింత సమయం కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కేసు తదుపరి విచారణను వేసవి సెలవుల చేపడతామని ప్రకటించింది.