
మణుగూరు: వెలుగు: మణుగూరు ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా భూసేకరణకు నిర్వాసితులు ఓకే చెప్పారు. భూసేకరణ గ్రామసభ గురువారం కొమ్ముగూడెం కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ మాట్లాడుతూ.. ఓపెన్ కాస్ట్ విస్తరణతో ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. నిర్వాసితులకు ఎకరానికి రూ.22.50 లక్షలతోపాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.5.5 లక్షలు ఇస్తామని, ప్రభుత్వ భూమిలో ఉన్న గిరిజనులకు కూడా ఇదే ప్యాకేజీ వర్తిస్తుందన్నారు. గిరిజనేతరులకు ఎకరాకు రూ.11.25 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు.
బాధిత కుటుంబాల్లోని నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇచ్చి, ఓపెన్ కాస్ట్ లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కోల్పోతున్న భూముల్లో ఉన్న చెట్లు, బోరు బావులకు, కట్టడాలకు వాల్యుయేషన్ ప్రకారం పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలోని చెరువుపై ఆధారపడిన మత్స్యకారులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.5.5 లక్షలు చెల్లిస్తామని పేర్కొన్నారు. దీనికి గ్రామస్తులు అంగీకరించి, సంతకాలు చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, తహసీల్దార్ నరేశ్, ఎంపీడీవో శ్రీనివాసరావు తదితరులున్నారు.