- ప్రస్తుతం ఒక్కో దేశంలో ఒక్కో వేరియంట్
- గతంలో మాదిరిగా గ్లోబల్ గా ఒకే వేరియంట్విస్తరించని వైనం
- త్వరలో కరోనా ఎండమిక్పై డబ్ల్యూహెచ్ఓ ప్రకటన!
పద్మారావునగర్, వెలుగు: ఐదైండ్ల కింద ప్రపంచాన్ని గడగడలాడించి, లక్షలాది మంది ప్రాణాలను హరించిన కరోనా భూతం ఇక అంతిమ దశకు చేరుకుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. 2019లో ఆల్ఫా వేరియంట్ తో ప్రపంచానికి భయం రుచి చూపించిన కొవిడ్ వైరస్2025 వరకు ఎన్నో వేరియంట్లతో ఆయా దేశాల్లో వ్యాప్తి చెందుతూనే ఉంది. ప్రస్తుతం జేఎన్1 వేరియంట్ చాలా తక్కువ వ్యాప్తిలో ఉందని, గ్లోబల్ గా ఈ వేరియంట్ చివరి దశ అవుతుందని గాంధీ ఆస్పత్రి క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్మాదాల అభిప్రాయపడ్డారు.
ఆదివారం ఆయన వెలుగుతో మాట్లాడుతూ.. కొవిడ్ పాండమిక్ దశలో ప్రపంచ వ్యాప్తంగా ఒకే వేరియంట్ తీవ్ర స్థాయిలో వ్యాప్తిస్తూ, కోట్లాది మంది ఆరోగ్యాలపై ప్రభావం చూపిందన్నారు. ఆ తర్వాత వైరస్ ప్రభావం సగం వరకు తగ్గి, కొన్ని దేశాలకే పరిమితమవుతూ మధ్యస్థ స్థాయి (ఎపిడమిక్)కి పడిపోయిందన్నారు. ఇప్పడు ప్రపంచంలోని ఒక దేశంలో వెలుగు చూసిన వేరియంట్ మరో దేశంలో కనిపించడం లేదన్నారు. దీనిని బట్టి కరోనా ఎండమిక్ దశకు చేరుకుందని భావిస్తున్నామన్నారు. ఏదైనా వైరస్ వ్యాప్తికి సాధారణంగా మూడు దశలు 1. పాండమిక్, 2. ఎపిడమిక్,3.ఎండమిక్ఉంటాయన్నారు.
ప్రస్తుతం సింగపూర్ లో వెలుగు చూసిన ఎన్బీ1.8.1 వేరియంట్ మరే దేశంలో లేదన్నారు. అలాగే మనదేశంలోని ఎక్స్ఎఫ్జీ వేరియంట్ మరే దేశంలో లేదన్నారు. దీన్ని బట్టి కరోనా వైరస్బలహీనపడిపోయి, ఆయా దేశాలు, ప్రాంతాలలోని ప్రజల ఇమ్యూనిటీ పవర్కు అనుగుణంగా అక్కడికే పరిమితమవుతుందని తెలుస్తోందన్నారు. ఒకవేళ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లయితే ఒకే మాదిరి వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా పాకేదన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలు చేస్తోందని, త్వరలోనే కరోనా ఎండమిక్పై ప్రకటన రావచ్చని తెలిపారు.
