ఫిబ్రవరి 17 నుంచి బయో ఏషియా సదస్సు.. ప్రారంభించనున్న సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు

ఫిబ్రవరి 17 నుంచి  బయో ఏషియా సదస్సు.. ప్రారంభించనున్న సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు
  • టెక్​బయో అన్​లీష్డ్​ థీమ్​తో రెండ్రోజులపాటు నిర్వహణ
  • లైఫ్​సైన్సెస్​లో మరిన్ని పెట్టుబడులు సాధించేలా వ్యూహాలు

హైదరాబాద్, వెలుగు: బయో ఏషియా 23వ ఎడిషన్​కు రంగం సిద్ధమైంది. హైటెక్స్​లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు మంగళవారం ప్రారంభం కానుంది.  టెక్​బయో అన్​లీష్డ్​ అనే థీమ్​తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఈ  ఏడాది 3 వేల మంది దాకా విదేశీ ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​బాబు సదస్సును ప్రారంభించనున్నారు. నిరుడితో పోలిస్తే ఈ ఏడాది హైటెక్స్​లో కొత్తగా ఏర్పాటు చేసిన విశాలమైన స్పేస్​లో కాన్ఫరెన్స్​ను నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. 

అంతర్జాతీయ డెలిగేట్స్​, ఇన్వెస్టర్లు, స్టార్టప్​లు, విదేశీ లైఫ్​సైన్సెస్​ సంస్థల నుంచి ప్రతినిధులు ఎక్కువ మంది వస్తుండడం.. డిమాండ్​ ఎక్కువగా రావడంతో ఈసారి ఎక్కువ స్పేస్​లో సదస్సును నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రపంచ వేదికపై తెలంగాణను గ్లోబల్​ టెక్​బయో పవర్​హౌస్​లా నిలిపేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. గత కొన్నేండ్లలో హైదరాబాద్​ ఫార్మా, బయోటెక్​ జీసీసీలకు గమ్యస్థానంగా నిలుస్తున్నది. 

వ్యాక్సిన్​మాన్యుఫ్యాక్చరింగ్​ కెపాసిటీని ప్రభుత్వం పటిష్టం చేసింది. బయోప్రాసెస్​ డిజైన్​, అడ్వాన్స్డ్​ థెరపీ, ఏఐ ఆధారిత హెల్త్​కేర్​ రంగాల్లో కొత్త పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ఏడాది కూడా ఆయా రంగాల్లో పెట్టుబడులు మరిన్ని సమకూర్చుకునేల ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తున్నది.

డిజిటల్​ హెల్త్​ సిస్టమ్​పై ఫోకస్

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​పై ఇప్పటికే ప్రత్యేకమైన దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దీంతో లైఫ్​సైన్సెస్​లోనూ ఏఐపై ఫోకస్​ పెట్టింది. అందులో భాగంగానే లైఫ్​సైన్సెస్​లో టెక్నాలజీకితోడు ఏఐ, ఆటోమేషన్ తీసుకురావాలని భావిస్తున్నది. ఇటీవల దావోస్​లో జరిగిన వరల్డ్​ ఎకనామిక్​ ఫోరమ్​ సదస్సులో నెక్ట్స్​జెన్​ లైఫ్​సైన్సెస్​ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. ఆ పాలసీని ప్రపంచదేశాలకు మరింత లోతుగా పరిచయం చేసి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నది. 

బయో ఏషియా 2026 సదస్సులో భాగంగా అంతర్జాతీయ నిపుణులతో ప్లీనరీలు, ప్యానల్ చర్చలు, పెట్టుబడుల ఒప్పందాలను చేసుకోనుంది. లైఫ్​సైన్సెస్​ వాల్యూ చెయిన్​లో అత్యంత సమర్థంగా ఆవిష్కరణలు చేసేందుకు ఏఐని ఎలా వినియోగించుకోవచ్చన్న దానిపై చర్చలు జరగనున్నాయి. ఏఐ సాయంతో కొత్త మందుల ఆవిష్కరణ, ఆటోమేషన్​ ద్వారా బయో మాన్యుఫ్యాక్చరింగ్, డిజిటల్​ హెల్త్​ సిస్టమ్​ను బలోపేతం చేయడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.