
ముంబై: రేట్ల పెరుగుదల ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో మరోసారి బెంచ్మార్క్ లెండింగ్ రేటును పెంచుతారని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నేటి నుంచి మూడు రోజుల పాటు ఇందుకోసం సమావేశం కానుంది. ఈ కమిటీ తన నిర్ణయాన్ని బుధవారం ప్రకటిస్తుంది. రెపో రేటును కనీసం 35 బేసిస్ పాయింట్ల దాకా పెంచవచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. మే నెల ఎంపీసీ మీటింగ్లో రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. దేశంలో రేట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకే వడ్డీ రేట్ల పెంపును ఆర్బీఐ అమలులోకి తెస్తోంది. దేశంలో రిటెయిల్ ఇన్ఫ్లేషన్ వరసగా ఏడో నెలలోనూ పెరిగి ఏప్రిల్ నెలలో ఎనిమిదేళ్ల హై 7.79 శాతాన్ని తాకింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెట్రోలు, డీజిల్ వంటి కమోడిటీ రేట్లు ఎక్కువగా పెరగడం వల్లే ఇన్ఫ్లేషన్ కిందకి దిగి రావడం లేదు. ఇక హోల్సేల్ ఇన్ఫ్లేషన్ కూడా గత 13 నెలలుగా రెండంకెలలోనే కొనసాగుతోంది. 2022 ఏప్రిల్ నెలలో ఇది ఏకంగా 15.08 శాతానికి చేరింది. రెపో రేటు పెంపుదల ఉంటుందని, ఎంతనేది ఇప్పుడే చెప్పలేనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవలే ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కేవలం వడ్డీ రేట్ల కోసమే కాకుండా, గ్రోత్, ఇన్ఫ్లేషన్లపై అంచనాలకు ఎంపీసీ మీటింగ్ ముఖ్యమైనదని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ చెప్పారు. ఈసారి రెపో రేటు పెంపుదల 25–35 బేసిస్ పాయింట్లకు మించి ఉండకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. జూన్లో 40 బేసిస్ పాయింట్లు, ఆగస్టులో మరో 35 బేసిస్ పాయింట్ల పెంపుదల ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా తన రిపోర్టులో అంచనా వేసింది.