ఆర్టీసీ డిస్పెన్సరీలో ఎక్స్​పైర్డ్​ మెడిసిన్.. కాలం చెల్లిన మందులిచ్చిన సిబ్బంది

ఆర్టీసీ డిస్పెన్సరీలో ఎక్స్​పైర్డ్​ మెడిసిన్.. కాలం చెల్లిన మందులిచ్చిన సిబ్బంది

మంచిర్యాల, వెలుగు:  మంచిర్యాల ఆర్టీసీ డిపోలోని డిస్పెన్సరీలో పేషెంట్లకు కాలం చెల్లిన మందులు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. యాకూబ్​ఖాన్ అనే డ్రైవర్​కొంతకాలంగా బీపీతో బాధపడుతూ ప్రస్తుతం డిపోలో పని చేస్తున్నాడు. ఆర్టీసీ డెస్పెన్సరీలో నెలనెలా మందులు తీసుకొని వాడుతున్నాడు. బుధవారం డిస్పెన్సరీకి వెళ్లగా ఆయనకు ఈ ఏడాది జనవరిలోనే ఎక్స్​పైరీ అయిన ట్యాబ్లెట్స్​ఇచ్చారు. ఇంటికి వెళ్లిన తర్వాత అతడి కొడుకు దీన్ని గమనించాడు. 


గురువారం డిస్పెన్సరీలో విషయం చెప్పడంతో వేరే మందులు ఇచ్చి పంపారు. ఎక్స్​పైరీ మందులతో అతడికి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ఈయూ డిపో సెక్రటరీ గోలి శంకర్​ ప్రశ్నించారు. డిస్పెన్సరీలో డాక్టర్​ పరంజ్యోతి కార్మికులకు అందుబాటులో ఉండడం లేదన్నారు. ఫార్మాసిస్ట్​ లేకపోవడంతో ఓ కండక్టర్​తో మందులు ఇప్పిస్తున్నారని తెలిపారు. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, ఎక్స్​పైరీ డేట్ చెక్​చేయకుండా మందులు ఎలా ఇస్తారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.


 డాక్టర్​ పరంజ్యోతిని వివరణ కోరగా సిబ్బంది పొరపాటున ఎక్స్​పైరీ అయిన మందులుఇచ్చారన్నారు. అయితే ఎనిమిది నెలల కిందట కాలం చెల్లిన మందులను ఎందుకు ఉంచారు? ఆ ట్యాబ్లెట్లను ఎంతమందికి ఇచ్చారు అన్నది తెలియడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై యాక్షన్​ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.