
- ముకేశ్ అంబానీ ఇంటి ముందు కారులో పేలుడు పదార్థాలు
- 20 జిలెటిన్ స్టిక్స్ను గుర్తించిన పోలీసులు
- కొన్ని నంబర్ ప్లేట్లు, ఓ లెటర్ స్వాధీనం
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. ముంబైలోని ముకేశ్ నివాసం ‘ఆంటీలియా’ ఎదుట స్కార్పియో కారులో.. 20 జిలెటెన్ స్టిక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం పెడ్డర్ రోడ్డులో నిలిపిన కారును గుర్తించిన అంబానీ సెక్యూరిటీ సిబ్బంది.. అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారును పరిశీలించిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ను పిలిపించారు. కారులో జిలిటెన్ స్టిక్స్ గుర్తించి డాగ్ స్క్వాడ్ను కూడా రప్పించారు. కారులో ఎక్క్ప్లోజివ్ డివైస్ ఏదీ కనిపించలేదని పోలీసులు చెప్పారు.
రెండు కార్లలో వచ్చి.. ఒకటి అక్కడే ఉంచి..
కారు లోపల కొన్ని నంబర్ ప్లేట్లు ఉన్నాయని, అవి ముకేశ్ అంబానీ సెక్యూరిటీ సిబ్బంది ఉపయోగించే కార్ల నంబర్లతో మ్యాచ్ అయ్యాయని, ఓ లెటర్ కూడా స్వాధీనం చేసుకున్నామతీ ముంబై పోలీసులు తెలిపారు. కారు ఓనర్ ఎవరనేది ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. గురువారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో రెండు కార్లలో కొందరు వచ్చినట్లు కనిపించింది. స్కార్పియో కారును అక్కడే ఉంచి, ఇన్నోవా కారులో వెళ్లిపోయినట్లు తెలిసింది.