న్యూఢిల్లీ: ఇన్సర్వీస్ టీచర్ల టెట్ అర్హత పరీక్షపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. విద్యాహక్కు చట్టం అమల్లోకి రాకముందు నియమితులై, ఐదేండ్లకు పైగా సర్వీస్ ఉన్న టీచర్లు ఉద్యోగాల్లో కొనసాగాలంటే కచ్చితంగా టెట్ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేసింది. టెట్ క్వాలిఫై కావడానికి గతంలో ఇచ్చిన రెండేండ్ల గడువును మూడేండ్లకు పెంచింది.
దీంతో ఇన్సర్వీస్ టీచర్లు టెట్ పాస్ కావడానికి ఉన్న 2027 ఆగస్టు 31 గడువు.. 2028 ఆగస్టు 31 వరకు పెరిగింది. ఈ వెసులుబాటు మినహా గతంలో ఇచ్చిన తీర్పు యథావిధిగా అమల్లో ఉంటుందని కోర్టు పేర్కొంది. ఐదేండ్లలోపు సర్వీసు ఉన్న టీచర్లు ఉద్యోగంలో కొనసాగాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా 2027 ఆగస్టు 31లోగా టెట్ క్వాలిఫై కావాలంటూ కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ 69 టీచర్ల సంఘాలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ల బెంచ్ శుక్రవారం విచారించింది. విద్యాహక్కు చట్టం కంటే ముందే ఉద్యోగాల్లో చేరిన తమకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, కెరీర్ మధ్యలో పరీక్ష రాయమనడం సరికాదని టీచర్ల సంఘాల వాదనను బెంచ్ తోసిపుచ్చింది. తన పాత తీర్పును సమర్థించుకుంటూ రివ్యూ పిటిషన్లను కొట్టేసింది.
