నిజామాబాద్లో ఉగ్రవాదుల లింకులు ఉన్నాయనే విషయం కలకలం రేపుతోంది. నిషేధిత సిమీ (Students Islamic Movement of India) అనుబంధ సంస్థ అయిన పీఎఫ్ఐ (Popular Front of India) ట్రైనర్ ఖాదర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ట్రైనింగ్ పేరిట పీఎఫ్ఐ (PFI) మత ఘర్షణల కుట్రకు తెరలేపిందని పోలీసులు నిర్ధారించారు. నిజామాబాద్ లోని ఆటోనగర్ లో ఓ ఇంట్లో ఉగ్ర శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో బుధవారం ఆ ఇంటిపై దాడి చేసి ట్రైనింగ్ ను భగ్నం చేశారు. శిక్షణలో జగిత్యాల, హైదరాబాద్, కర్నూలు, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన యువకులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో మారణాయుధాలు, నిషేధిత సాహిత్యం, నోట్ బుక్స్ లను స్వాధీనం చేసుకున్నారు.
మత ఘర్షణలు జరిగిన సమయంలో ఎలా వ్యవహరించాలి, భౌతిక దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణనిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. జిల్లాలో పీఎఫ్ఐ (PFI) ఎక్కడెక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుందనే దానిపై ఆరా తీస్తున్నారు. ఖాదర్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుస్తామన్నారు. యువత ఆసక్తి చూపవద్దని, సంయమనం పాటించాలని సూచించారు. గత సంవత్సరం బోధన్ లో ఒకే అడ్రస్ పై బంగ్లాదేశీయులకు 72 పాస్ పోర్టులు జారీ అయిన సంగతి తెలిసిందే. గతంలో బోధన్ లో ఉగ్ర కదలికలు వెలుగు చూశాయి. సౌదీలో ఉన్న సమయంలో ఆ వ్యక్తి కదలికలపై నిఘా పెట్టారు. ఉగ్రవాదులతో లింకులున్నాయని అతడిని అదుపులోకి తీసుకున్నారు.