
జూబ్లీహిల్స్ , వెలుగు: వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. రాత్రికిరాత్రే అక్కడ వాలిపోయి ప్రభుత్వ బోర్డులను పీకేసి కబ్జాకు యత్నించారు. పోలీసుల రంగ ప్రవేశంతో తోక ముడిచారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని జలమండలి రిజర్వాయర్ పక్కన 5 ఎకరాల స్థలాల్ని కొందరు కబ్జాకు యత్నించారు. సోమవారం (సెప్టెంబర్ 03) రాత్రి ప్రభుత్వ బోర్డులను మాయం చేసి కొందరు రౌడీ మూకలు తిష్ట వేశారు.
సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, బంజారాహిల్స్ సీఐ రంగప్రవేశం చేశారు. దీంతో అక్రమార్కులు అక్కడ నుంచి పారిపోయారు. వీరిలో పార్థసారథి, విజయ్ భార్గవ్ అనే వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. వీరిపై ఇప్పటికే మూడు క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిసింది.