రాజీవ్ ​స్వగృహలోని ఇండ్లలో కనీస సౌకర్యాల్లేవు

రాజీవ్ ​స్వగృహలోని ఇండ్లలో కనీస సౌకర్యాల్లేవు

కామారెడ్డి , వెలుగు:  రాజీవ్​స్వగృహలోని  అసంపూర్తి ఇండ్లు, ఖాళీ ప్లాట్ల అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం సమకూరినా ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదు.  ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  రూ. 12.43 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపగా గవర్నమెంట్​ కేవలం రూ. 75 లక్షలు శాంక్షన్​ చేసింది.   

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధరణి టౌన్​షిపు పేర రాజీవ్​స్వగృహ ఇండ్ల నిర్మాణం చేపట్టగా మధ్యలో నిలిచిపోయాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రాజీవ్​ స్వగృహ ఇండ్లు, ప్లాట్లను అమ్మేందుకు ప్రభుత్వం వేలం నిర్వహించింది. కామారెడ్డి ధరణి టౌన్​షిప్​ ఇండ్లు, ప్లాట్ల అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి  రూ.50.71 కోట్ల ఆదాయం సమకూరింది.  మధ్య తరగతివారు,  ఉద్యోగుల కోసం  గత ప్రభుత్వ హాయంలో   రాజీవ్ స్వగృహ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. హౌజింగ్ కార్పొరేషన్​ద్వారా గవర్నమెంట్​స్థలాలను డెవలప్​చేసి.. ఇండ్లు కట్టి అమ్మాలని  భావించారు.  ఇందులో  భాగంగా  కామారెడ్డి దగ్గర  అడ్లూర్​ శివారులో  హైవే పక్కన  50 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సేకరించారు.  బేసిక్​,  సివిక్​,  క్లాసిక్​,  ఇంట్రీన్ సిక్​కేటగిరిల్లో 100, 150,  200, 266 గజాల  ప్లాట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ 543 ఇండ్లు కట్టాలని ప్లాన్​ చేసి పనులు ప్రారంభించారు.  ఇందులో   313 ఇండ్ల నిర్మాణం చేపట్టగా కొంతకాలానికి  వివిధ దశల్లో పనులు అగిపోయాయి.  మరో 230 ఓపెన్​ ప్లాట్లు ఉన్నాయి.  గత ఏడాది ఈ ఇండ్లు, ప్లాట్లను వేలం ద్వారా అమ్మకాలు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది.  

ఇప్పటికే 4 విడతల్లో వేలం 

కామారెడ్డి ధరణి టౌన్​ షిపులో   ఇప్పటి వరకు 4 సార్లు వేలం నిర్వహించారు. కలెక్టర్​ ఆధ్వర్యంలో వ్యాపారులు, రియల్​ఎస్టేట్ వ్యాపారులు, ఎంప్లాయిస్​తో  మీటింగ్​లు నిర్వహించారు.  ఇండ్లు, ప్లాట్లు కొంటే  టౌన్​షిపులో మౌలిక వసతులు కల్పిస్తామని  హామీ ఇచ్చారు.  మొదటి విడతలో  150కి పైగా ప్లాట్లు అమ్ముడుపోయాయి.  ఆ తర్వాత  ఇప్పటి వరకు 4 సార్లు  వేలం  నిర్వహించగా,  351ఇండ్లు, ప్లాట్లు  అమ్ముడుపోయాయి.  ఇంకా  192  అమ్మాల్సి ఉంది.    

రూ.12.43 కోట్లతో  ప్రపోజల్స్​  

ధరణి టౌన్ షిపులో  రోడ్లు,  డ్రైనేజీ,  సెప్టిక్​ ట్యాంక్​ల నిర్మాణం, వాటర్​పైపులైన్లు,  కరెంటు పోల్స్​  కోసం తదితర పనులు చేపట్టవలసిఉంది. ఈ సౌకర్యాల కోసం   రూ.12.43 కోట్లతో  జిల్లా ఆఫీసర్లు ప్రపోజల్స్​ తయారీ చేసి గవర్నమెంట్​కు పంపారు. అయితే సర్కారు కేవలం రూ.75 లక్షలు  శాంక్షన్​చేసింది.  ఈ ఫండ్స్​తో   కరెంట్​ లైన్​,  ట్రాన్స్​ఫార్మర్లను ఏర్పాటు చేశారు.  వేలం ప్రక్రియకు ముందు  ఏరియా క్లీనింగ్​ , మట్టి రోడ్డు వేయటానికి  కలెక్టర్​,  మున్సిపల్​ ఫండ్స్​ నుంచి రూ. 5 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇండ్లు, ఖాళీ స్థలాలు కొన్నవారు ఇక్కడ ఉండాలంటే మౌలిక వసతులు కల్పించాలి. కానీ ప్రభుత్వం ఫండ్స్​రిలీజ్​ చేయకపోవడంతో ప్లాట్లు కొన్నవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.