
హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ టైమ్లో ఆకతాయిలు ఆన్ లైన్ చాటింగ్ పేరుతో టైంపాస్ చేస్తున్నారు. అమ్మాయిల పేరుతో ఫేస్ బుక్, ట్విట్టర్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి రిక్వెస్ట్లు పంపుతున్నారు. ఫ్రెండ్ షిప్ చేద్దామంటూ వారితో చాట్ చేస్తున్నారు. మరికొందరు చాటింగ్ పేరుతో అమ్మాయిలను వేధిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో ఈవ్ టీజర్ల బారినపడిన ముగ్గురు యువతులు సైబర్ క్రైం పోలీసులకు కంప్లయింట్ చేశారు. తన ఫోన్ నంబర్ ని గుర్తుతెలియని వ్యక్తులు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారని మారేడ్ పల్లికి చెందిన యువతి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను మంగళవారం ఆశ్రయించింది. లాక్ డౌన్ ఫ్రెండ్ షిప్ పేరుతో తనకు తెలియని వ్యక్తుల నుంచి ఫేస్ బుక్, ట్విట్టర్ రిక్వెస్ట్లు అదేపనిగా వస్తున్నాయని గత వారం మరో యువతి ఫిర్యాదు చేసింది.
చాటింగ్ చేయాలంటూ వేధింపులు
కొందరు ఆకతాయిలు వాట్సాప్ గ్రూప్ చాటింగ్ లో తమకు తెలిసిన యువతులు, విద్యార్థినుల గురించి అసభ్యంగా పోస్టింగ్స్ చేస్తున్నారని పోలీసుల దృష్టికి వచ్చింది. ఓ విద్యార్థిని పేరెంట్స్ ఇచ్చిన సమాచారంతో గత వారం నలుగురు యువకులపై కేసులు నమోదు చేశారు. ఇంట్లో కూర్చుని తమ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న యువతులను చాటింగ్ చేయాలని వేధిస్తున్నారు. మరికొందరు ఆవారాలు గుర్తుతెలియని వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేస్తున్నారు. అవతలి నుంచి రిప్లై రాగానే కాల్ చేస్తున్నారు. మాట్లాడే వాళ్లు అమ్మాయిలయితే చాటింగ్ చేయాలంటూ వేధిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు కూడా అయిఉండొచ్చు
ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ రిక్వెస్ట్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గుర్తు తెలి యని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్, సోషల్ మీడియా రిక్వెస్ట్ లకు రెస్పాండ్ అవద్దు. విమెన్ ప్రొఫైల్స్, ఫేక్ ఐడీతో సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిల్ చేసే అవకాశాలున్నాయి. సోష ల్ మీడియాలో వేధింపులు ఎదురైతే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేయాలి.
‑ కేవీఎం ప్రసాద్, సైబర్ క్రైం ఏసీపీ, హైదరాబాద్